ISRO | చంద్రుడిపైకి ల్యాండర్ మిషన్ విజయవంతంగా ప్రయోగించినందుకు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీని ఇస్రో గురువారం అభినందించింది. మూన్ మిషన్లో భాగంగా సక్సెస్ ఫుల్గా రాకెట్ను నింగిలోకి పంపగా.. అంతర్జాతీయ అంతరిక్ష కమ్యూనిటీలో మరో దేశం విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ కావాలంటూ ఇస్రో ఆకాంక్షించింది. ఈ మేరకు బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం ట్వీట్ చేసింది.
జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (Jaxa) గురువారం ఎక్స్-రే టెలిస్కోప్తో కూడిన రాకెట్ను ప్రయోగించింది. విశ్వ రహస్యాలను, చంద్రుడిపై పరిశోధనలు జరిపేందుకు ల్యాండర్ను పంపింది. అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడిన జపాన్ రాకెట్ ప్రయోగం గురువారం ఉదయం విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. నైరుతి జపాన్లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఎక్స్రే టెలిస్కోప్, లూనార్ ల్యాండర్ను తీసుకుని హెచ్-2ఏ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ఇదిలా ఉండగా.. చంద్రయాన్-3తో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఇస్రో.. మరిన్ని మిషన్లను చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా జాక్సాతో కలిసి ఓ ప్రాజెక్టుపై పని చేయనున్నది.
ప్రాజెక్టులో భాగంగా 2025 సంవత్సరంలో చంద్రుడిపైకి రోవర్ను పంపనున్నది. దీనికి ఇంటర్నేషనల్ మూన్ రీసెర్చ్ ప్రాజెక్టుకు లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ (LUPEX) పేరును ఖరారు చేశారు. మిషన్లో భారత్, జపాన్తో పాటు అమెరికా, యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీలకు చెందిన పరిశోధనా పరికరాలను చంద్రుడిపైకి తీసుకెళ్లనున్నారు. వీటి సహాయంతో చంద్రుడి ధ్రువాల వద్ద నీటి ఆవిరి ఉనికి, అక్కడి ధూళిలో విద్యుదయస్కాంత పరిమాణంపై అధ్యయనం చేయనున్నారు. మరో కీలకమైన విషయం ఏంటంటే.. చంద్రుడిపై శాశ్వతంగా పరిశోధనా స్థావరాన్ని స్థాపించడమే ఈ ప్రాజెక్టు అసలు లక్ష్యం.