న్యూఢిల్లీ, మార్చి 4: భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ సోమనాథ్ క్యాన్సర్ బారినపడ్డారు. టార్మాక్ మీడియా హౌస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సూర్యుడిపై ప్రయోగాలకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం రోజే తనకు క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు తెలిపారు. చంద్రయాన్-3 లాంచింగ్ సమయంలోనే తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, అయితే దానిపై అప్పట్లో అంత స్పష్టత లేదని పేర్కొన్నారు.
చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా కాలుమోపిన కొన్ని వారాల తర్వాత అంటే 2023 సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1ను ప్రయోగించారు. ఆ తర్వాత ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. అనంతరం కీమోథెరపీ ప్రారంభమైంది. తనకు క్యాన్సర్ సోకిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారని సోమనాథ్ చెప్పారు. క్యాన్సర్కు పరిష్కారంగా చికిత్స ఉందన్న విషయం ఇప్పుడు తనకు అర్థమైందన్నారు. క్యాన్సర్ ఆయనకు వంశపారంపర్యంగా వచ్చినట్టు తెలిసింది. క్యాన్సర్తో పోరాడి కోలుకున్న నాలుగు రోజుల తర్వాత ఆయనీ విషయాన్ని బయటపెట్టారు. ఐదో రోజే విధుల్లో చేరారు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని, విధులు నిర్వర్తిస్తున్నట్టు సోమనాథ్ తెలిపారు.