ISRO | చంద్రయాన్-3 ప్రయోగించిన నాటి నుంచి ఓ చిత్రం తెగ వైరల్ అవుతున్నది. రాకెట్ సంబంధిత భాగాన్ని శాస్త్రవేత్తలు సైకిల్పై తీసుకెళ్తున్న చిత్రం ఓ వైపు, నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ మరోవైపు. సోషల్మీడియాను ఊపేసిన చిత్రమిది. అర్ధ శతాబ్దంలో ఎంత తేడా… జాబిల్లిని చూసి మైమరచిపోయే నాటి నుంచి చంద్రుడిపై ల్యాండర్ను దించనున్న నాలుగో దేశంగా భారత్ అవతరించనున్న నేటి వరకు ఎన్నో వ్యయ ప్రయాసలు, ఎన్నో ఒడిదొడుకులు. అన్నింటినీ అధిగమించిన భారత్ ప్రస్తుతం సగర్వంగా అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నది.
న్యూఢిల్లీ, జూలై 21: సొంత సైకిళ్లపై శాస్త్రవేత్తలే రాకెట్ల సామగ్రిని మోసుకెళ్లిన ఆనాటి నుంచి నేటి వెలుగుల వరకు ఇస్రో ప్రయాణం అనితర సాధ్యమైనది. ప్రయోగాలు చేసేందుకు సొంత వేదిక లేకపోవడంతో విదేశీ లాంచ్ప్యాడ్ల నుంచి ప్రయోగాలు చేసిన ఆ రోజుల నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో రాకెట్లు తయారు చేసి నింగిలోకి దూసుకెళ్తున్న ఈరోజు వరకు ఇస్రో సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
భారత్లో అంతరిక్ష ప్రయోగాలు 1960ల్లో పురుడుపోసుకున్నాయి. ‘తినడానికి తిండికి దిక్కు లేదు కానీ అంతరిక్షంపై ప్రయోగాలా?’ అని ఎంతో మంది అవహేళన చేశారు. కానీ వాటన్నింటికి తన ప్రయోగాల ద్వారానే ఇస్రో సమాధానం చెప్పింది. తిరువనంతపురంలోని తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి భూమి పైన ఉండే వాతావరణంలోకి మాత్రమే చేరే సౌండ్ రాకెట్లను ప్రయోగించింది. ఆ తర్వాత విక్రమ్ సారాభాయి నేతృత్వంలో 1969లో ఇస్రో పురుడుపోసుకున్నది. శాస్త్రవేత్తల నిర్విరామ కృషితో భారత్ సొంతంగా ఆర్యభట్ట ఉపగ్రహాన్ని తయారు చేయగలిగింది. కానీ దాన్ని ప్రయోగించేందుకు రాకెట్, లాంచ్ప్యాడ్ లేకపోవడంతో అప్పటి సోవియట్ యూనియన్ సహకారంతో 1975లో దాన్ని విజయవంతంగా ప్రయోగించింది. 1979లో రోహిణి పేరిట భారత్ వరుస ప్రయోగాలు చేసింది. తర్వాత సొంతంగా ల్యాంచ్ ప్యాడ్ తయారు చేసుకుంది. ఎన్నో ప్రయోగాలు చేసి పీఎస్ఎల్వీని అభివృద్ధి చేసింది.
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పీఎస్ఎల్వీ రాకెట్ను 1993 సెప్టెంబర్ 20న ఇస్రో తొలిసారి ప్రయోగించింది. కానీ నింగిలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికే ఇది విఫలమైంది. పేలోడ్ రాకెట్ నుంచి వేరుపడలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అనంతరం కొన్ని మార్పులు చేసిన తర్వాత 1994 అక్టోబర్ 15న పీఎస్ఎల్వీ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడంతో భారత్ సగర్వంగా తలెత్తుకున్నది. 1997 సెప్టెంబర్ 29న ఐఆర్ఎస్-1డీ శాటిలైట్ను పీఎస్ఎల్వీ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో అప్పటి నుంచి భారత్ వెనుదిరిగి చూసుకోలేదు.