All Eyes On Raffah | న్యూఢిల్లీ, మే 29: పాలస్తీనాలోని రఫాపై ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడి పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనను ఖండిస్తూ, బాధితులకు సంఘీభావం తెలుపుతూ వివిధ రంగాల ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. రఫాలో ఏం జరుగుతుందో అందరూ చూడాలి అనే భావనతో.. ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ అనే నినాదం రాసి ఉన్న ఒక ఫొటో వైరల్గా మారింది. ఏఐ ద్వారా రూపొందించిన ఈ ఫొటోలో శరణార్థి శిబిరాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా #AllEyesOnRaffah అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్గా మారింది.
భారత్లోనూ నటీనటులు వరుణ్ ధావన్, రష్మిక మందన్నా, సమంత, త్రిష, దుల్కర్ సల్మాన్, అమీ జాక్సన్, ఆలియా భట్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా, దియా మీర్జా, రిచా చద్దా, త్రిప్తి దిమ్రి, తదితరులు ఈ ఫొటోను షేర్ చేశారు. రఫా సురక్షిత ప్రాంతమని గతంలో ఇజ్రాయెల్ ప్రకటించింది. రఫా సురక్షితమని చెప్పి, ఆశ్రయం పొందుతున్న ప్రజలపై ఇప్పుడు దాడి చేయడం పట్ల ఇజ్రాయెల్ వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆదివారం రఫాలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 45 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. వందల మంది గాయపడ్డారు.
గాజాలో హమాస్తో చేస్తున్న యుద్ధం ఈ ఏడాదంతా కొనసాగవచ్చని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు జాతీయ భద్రతా సలహాదారు జాచి హనేగ్బి స్పష్టం చేశారు. గాజాలో హమాస్ పాలనను అంతం చేయడం, హమాస్, దాని అనుబంధ సంస్థలు ఇజ్రాయెల్పై దాడి చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని బుధవారం తెలిపారు. శరణార్థ శిబిరాలు ఉన్నందున రఫాపై దాడిని వెంటనే ఆపేయాలని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశించినప్పటికీ ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. మంగళవారం తొలిసారిగా రఫా నగరంలోకి యుద్ధట్యాంకులను పంపించింది. మరోవైపు రఫాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిని అమెరికా ఖండిస్తూనే.. ఇజ్రాయెల్పై తమ విధానంలో మార్పు ఉండదని స్పష్టం చేసింది.