న్యూఢిల్లీ, మే 28: అయోధ్య భూవివాదంపై మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని జమాత్ ఉలేమా-ఎ-హింద్(జేయూహెచ్) చీఫ్ మౌలానా అర్షద్ మదాని పేర్కొన్నారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ తమ సంస్థ కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నదని చెప్పారు.
ఒక మసీదును ఏ ముస్లిం కూడా అసలు స్థానం నుంచి మార్చడని, కాబట్టి మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని అంగీకరించే ప్రసక్తే ఉండదని పేర్కొన్నారు.
విభజన శక్తుల పాలనలో దేశం
దేశంలో విభజన శక్తుల పాలన నడుస్తున్నదని, ఇస్లామోఫోబియా పెరుగుతున్నదని పలువురు ముస్లిం మత పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లా దేవబంద్లో శనివారం ప్రారంభమైన రెండ్రోజుల జమాత్ ఉలేమా-ఎ-హింద్ సమావేశాల సందర్భంగా పలువురు మత పెద్దలు మాట్లాడారు. దేశంలో ముస్లింలు కనీసం బతకడానికే చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘సొంత దేశంలో మమ్మల్ని పరాయి వాళ్లుగా చేస్తూ వస్తున్నారు’ అని జమాత్ చీఫ్ అసద్ మదానీ పేర్కొన్నారు.