పాకిస్థానీ డిఫెన్స్ జర్నలిస్టు అరూసాఆలంతో తన స్నేహంపై ఆత్మరక్షణలో పడ్డ పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ ఎదురుదాడికి దిగారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో అరుసా ఆలం సంబంధాలపై దర్యాప్తు చేయాలన్న పంజాబ్ హోంమంత్రి సుఖ్జిందర్ రంధావా డిమాండ్ నేపథ్యంలో కెప్టెన్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. కేంద్ర మాజీ మంత్రి సుష్మస్వరాజ్, కేంద్రమంత్రి అశ్వినీ కుమార్ సహా పలువురు ప్రముఖులతో అరూసా ఆలం దిగిన ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అరూసా ఆలంతోపాటు వారందరికీ ఐఎస్ఐతో లింక్లు ఉండొచ్చునని భావిస్తున్నానని కామెంట్ చేశారు.
దీనిపై ఆరోపణలు చేసేవారు ముందుగా ఆలోచించుకోవాలి. భారత్, పాకిస్థాన్ మధ్య దురదృష్టవశాత్తు వీసాలపై నిషేధం అమల్లో ఉంది. లేకపోతే ఆమెను మరోమారు రావాలని ఆహ్వానించే వాడిని. వచ్చే మార్చిలో నేను 80వ వసంతంలోకి అడుగిడతా.. వచ్చే ఏడాది ఆమెకు 69 ఏండ్లు వస్తాయి. సంకుచిత మనస్తత్వంతో ఆలోచించే వారే ఇలా వ్యవహరిస్తారు అంటూ ఫేస్బుక్లో కెప్టెన్ పోస్ట్ పెట్టారు.
నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద ప్రజా నాయకుడిగా ఉన్న కెప్టెన్.. సిద్ధూకు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం పదవికి రాజీనామా చేసి, పార్టీ నుంచి బయటకు వచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేసి బీజేపీతోనూ అకాలీదళ్ చీలిక గ్రూపులతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని తలపోస్తున్నారు.
అమరిందర్ సింగ్ 2004లో పాక్లో పర్యటించినప్పుడు ఆయనను అరూసా ఆలం కలుసుకున్నారు. నాటి నుంచి నిత్యం ఆమె పంజాబ్లో కెప్టెన్ను కలుసుకునే వారు. పంజాబ్ సీఎంగా కెప్టెన్ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యారు. అయితే, 2018లో పాక్ ప్రధానిగా ఇమ్రాన్ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఆ దేశ ఆర్మీ చీఫ్ను సిద్ధూ కౌగిలించుకోవడాన్ని కెప్టెన్ తప్పుబట్టారు. నాటినుంచి అరూసా ఆలం పేరు బయటకు వచ్చింది.
పాక్ మిలిటరీ అధికారులతో అరూసా ఆలం దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. ఆమెకు ఐఎస్ఐ అధికారులతో లింక్లపై దర్యాప్తు చేయాలని పంజాబ్ హోంమంత్రి రంధావా.. రాష్ట్ర డీజీపీని కోరారు.
ఐఎస్ఐ నుంచి పంజాబ్కు ముప్పు ఉందని కెప్టెన్ చెబుతున్నారు. అరూసా ఆలంతో ఐఎస్ఐకి గల లింక్లపైనా మేం దర్యాప్తు చేస్తాం. పాకిస్థాన్ నుంచి డ్రోన్లు వస్తున్నాయని నాలుగున్నరేండ్లుగా కెప్టెన్ చెబుతున్నారు. పంజాబ్లోకి బీఎస్ఎఫ్ బలగాలు ప్రవేశించాకే కెప్టెన్ తొలుత ఈ అంశాన్ని లేవనెత్తారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని రంధావా ఓ వార్తా చానెల్కు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
28 నుంచి ప్లిఫ్కార్ట్ బిగ్ దివాళి సేల్ : ఐఫోన్ 12, షియోమి ఫోన్లపై భారీ ఆఫర్లు!
EPFO Balance | పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..
Tax on Gratuity | గ్రాట్యుటీ మీద పన్ను ఉంటుందా?
Fuel Price Hike | 2020 మే నుంచి పెట్రోల్, డీజిల్ ధరలెలా పెరిగాయంటే!
పెట్రోల్, డీజిల్ ధరలపై ‘శతాబ్ది ఉత్సవాలు జరుపుకోండి’.. కేంద్రానికి చిదంబరం చురకలు