Madhya Pradesh | భోపాల్, జూలై 8: ఆదివాసీపై మూత్ర విసర్జన ఘటనలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సత్వర న్యాయం పేరుతో ఆటవికంగా వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారి విమర్శలకు దారి తీసింది. ఒక వ్యక్తి చేసిన తప్పుకు అతడి కుటుంబాన్ని రోడ్డుపాలు చేయడం ఆదివాసీ సమాజాన్ని సైతం నొప్పించింది. ఒకరు తప్పు చేస్తే కుటుంబం మొత్తానికి శిక్ష వేయడం ఏమిటని ప్రశ్నించింది. ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడానికైనా.. ఇతర కారణాల వల్లనైనా బుల్డోజర్ న్యాయం అమలు చేయడానికి ప్రభుత్వానికైనా చట్టపరమైన అధికారాలున్నాయా అనే అంశాన్ని లెవనెత్తింది.
నా కొడుకుని కఠినంగా శిక్షించాల్సిందే
నిందితుడు ప్రవీశ్ శుక్లా తండ్రి రమాకాంత్ శుక్లా మీడియా ముందుకు వచ్చారు. తన కొడుకు చేసిన పనికి అతడిని కఠినంగా శిక్షించాలని అన్నారు. అయితే తన కుమారుడు చేసిన నేరానికి..ప్రభుత్వం తన ఇంటిని కూల్చివేసిందని, ఇప్పుడు తన కుటుంబ సభ్యులంతా రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బుల్డోజర్ న్యాయం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘చట్ట ప్రకారం విచారణ జరగనివ్వండి. నా కొడుకు తప్పు చేశాడని తేలితే అతడికి కఠిన శిక్ష పడాల్సిందే. కానీ ఇంటిని కూల్చేయటమేంటి? ఇంట్లోని ఆడవాళ్లు ఎక్కడ తలదాచుకోవాలి? వృద్ధురాలైన నా తల్లికి 80 ఏండ్లు. ముగ్గురు మనవరాండ్లు, కోడళ్లు ఉన్నారు. వీరంతా ఎక్కడికి పోవాలి.. ఎక్కడ తల దాచుకోవాలి?’ అంటూ.. ప్రభుత్వ చర్యను రమాకాంత్ తప్పుబట్టారు.
ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం వినలేదు
‘ప్రభుత్వం కూల్చిన ఇల్లు ప్రవేశ్ది కాదు, అతడి స్థలం కూడా కాదు. అతడి డబ్బుతో కట్టలేదు. ఈ ఇల్లు తాత తండ్రుల నుంచి నాకు వారసత్వంగా సంక్రమించింది’ అని రమాకాంత్ చెప్పారు. ఎంత చెప్పినా ప్రభుత్వ యంత్రాంగం వినిపించుకోకుండా తన ఇల్లును కూల్చేశారని తెలిపారు. ‘నా ఇంటిని కూల్చటం పూర్తిగా అన్యాయం. తప్పు చేసినట్టు తేలితే కొడుకును ఉరితీయండి’ అని రమాకాంత్ అన్నారు. బుల్డోజర్తో ఇంటిని కూల్చడాన్ని కోల్ ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన సభ్యులు సైతం ఖండించారు. ఇంటిని కూల్చటం చాలా తప్పు..అన్నారు. ‘ఒక పక్షి గూడు దెబ్బ తింటేనే మేం తట్టుకోం. అలాంటిది ప్రభుత్వం అధికారుల్ని పంపి..మహిళలు, పిల్లలు ఉన్న ఇంటిని కూల్చేటం దారుణం’ అని ఒక సభ్యుడు అన్నారు.
‘తప్పు తెలుసుకున్నాడు.. విడిచిపెట్టండి’
సిధి జిల్లాలో ఆదివాసీపై బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన ఘటన దేశ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే నిందితుడు ప్రవేశ్ శుక్లా పట్ల బాధితుడు దశ్మత్ రావత్ తన ఔదార్యం చాటాడు. ‘ఘటన తర్వాత ప్రవేశ్ శుక్లా తన తప్పు తెలుసుకున్నాడు. అతడు చేసింది తీవ్రమైన తప్పే కావచ్చు. కానీ జరిగిందేదో జరిగిపోయింది, అతడ్ని విడిచిపెట్టండి’..అంటూ మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రావత్ కోరాడు.