చెన్నై, ఆగస్టు 3: 140 దేశాల్లోని పన్నుల విధానాలతో పోల్చిచూస్తే మోదీ సర్కారు తీసుకొచ్చిన జీఎస్టీ విధానం అత్యంత లోపభూయిష్టమైనదని తమిళనాడు ఆర్థికమంత్రి త్యాగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానంలో అనేక లొసుగులు ఉన్నట్టు మండిపడ్డారు. విపక్షాలతో సంప్రదింపులు జరుపకుండానే జీఎస్టీ పెంపు నిర్ణయం తీసుకొచ్చారని, దీనికి తాము వ్యతిరేకమన్నారు. జీఎస్టీ పెంపు సమాఖ్య నిర్ణయం కాదని తెలిపారు. అసలు జీఎస్టీ కౌన్సిలే ఒక రబ్బరు స్టాంప్ అని పేర్కొన్నారు. కౌన్సిల్లో ఒక తీర్మానం ఆమోదం పొందాలంటే 75 శాతం ఓట్లు అవసరమని చెప్పారు. కేంద్రప్రభుత్వానికి 33 శాతం ఓట్లు ఉన్నప్పుడు, మోదీ ప్రభుత్వాన్ని కాదని ఏదైనా తీర్మానం ఎలా పాస్ అవుతుందని ప్రశ్నించారు. కౌన్సిల్లో తీసుకునే నిర్ణయాలపై కేంద్రానిదే పెత్తనమని చెప్పారు. విమర్శలు వస్తాయని భావించే నిర్ణయాలను కౌన్సిల్ తీసుకున్నదని కేంద్రం తప్పించుకు తిరుగుతున్నదని విరుచుకుపడ్డారు.