న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారి ఆటకట్టించటానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానున్నది. అందులో భాగంగా సోమవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది. దీని కింద నేరం నిరూపితమైతే గరిష్ఠంగా పదేండ్లు జైలు, కోటి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు.
పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే ముఠాలనేగాక వారికి సహకరించిన ప్రభుత్వ అధికారులు కూడా శిక్షార్హులే. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో కీలకమైన పోటీ పరీక్షల్లో అవకతవకలు జరగటం, పరీక్షలు వాయిదా పడటం, సిన్సియర్గా చదివి పరీక్షలకు హాజరైన విద్యార్థులు నష్టపోవటం సర్వసాధారణమైంది. ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు అందుతున్నా.. ఇప్పటి వరకు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడిన దాఖలాలు చాలా స్వల్పం.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అక్రమార్కులపై కొరఢా ఝుళిపించాలని నిర్ణయించింది. ఇందుకోసమే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లును లోక్సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు కేంద్రానికి సిఫారసులు అందాయి. వాటిని పరిశీలించిన కేంద్రం ఉన్నత స్థాయి జాతీయ సాంకేతిక కమిటీని ఈ బిల్లులో ప్రతిపాదించింది.
పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను తీసుకొచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. సిన్సియర్గా చదువుకుని పరీక్షలకు హాజరయ్యే యువ అభ్యర్థులకు భరోసా ఇవ్వటమే ఈ బిల్లు ఉద్దేశమని, అంతేకానీ విద్యార్థులు లక్ష్యంగా చేసుకుని రూపొందించిన బిల్లు కాదని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ బిల్లు గురించి మొదటిసారి జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారు. ఎగ్జామ్స్లో జరిగే అక్రమాల వల్ల యువత పడే ఆందోళన ప్రభుత్వం గుర్తించిందని, ఈ సమస్యపై కఠినంగా వ్యవహరించేందుకు సరికొత్త చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించిందని ముర్ము వెల్లడించారు.