Iron Bridge Stolen | 90 అడుగుల పొడువు, 6వేల కిలోల బరువున్న ఐరన్ బ్రిడ్జిని దొంగలు మాయం చేశారు. వాహనదారులతో నిత్యం రద్దీగా ఉండే ముంబయి మలాడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు.. రంగ ప్రవేశం చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర మలాడ్ పశ్చిమ ప్రాంతంలో ఓ కాలువపై నుంచి కేబుల్ లైన్ వేసేందుకు యుటిలిటీ కంపెనీ అదానీ ఎలక్ట్రిసిటీ భారీ ఎలక్ట్రిక్ తాత్కాలికంగా ఐరన్ వంతెనను నిర్మించింది.
ఆ తర్వాత శాశ్వతంగా వంతెన నిర్మాణం చేపట్టి.. దాదాపు నెల రోజుల కిందట అక్కడి నుంచి కేబుల్ లైన్ను మార్చిందని బంగూర్నగర్ పోలీస్స్టేషన్ అధికారి తెలిపారు. శాశ్వత నిర్మాణం తర్వాత ఐరన్ వంతెన నిరుపయోగంగా ఉన్నది. ఇటీవల తాత్కాలిక వంతెన కనిపించకుండా పోయింది. రద్దీగా ఉండే ప్రాంతం నుంచి ఐరన్ వంతెన మాయం కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో కంపెనీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఘటనా స్థలం సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో అమర్చిన నిఘా కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. వంతెన వైపుగా పెద్ద వాహనం వచ్చిన గుర్తించారు.
ఆ వాహనంలో గ్యాస్ కట్టింగ్ మిషన్లు కనిపించాయి. ఆ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వంతెన నిర్మాణానికి కాంటాక్ట్ ఇచ్చిన కంపెనీ ఉద్యోగి పాత్ర ఇందులో ఉందని గుర్తించారు. అతనితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. సంఘటనా స్థలం నుంచి ఎత్తుకువెళ్లిన సామగ్రిని సైతం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. ఇదిలా ఉండగా.. గతంలో బిహార్లోనూ దొంగలు ఐరన్ బ్రిడ్జిని సైతం మాయం చేసిన విషయం తెలిసిందే.