MANIPUR| న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండ, లైంగికదాడుల ఘటనలపై మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మల స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీ తక్షణమే జోక్యం చేసుకుని, పరిస్థితులను చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు ప్రమాదకర స్థాయికి చేరాయని.. మీతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చేయిదాటి పోయాయని చెప్పారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన వీడియో.. ఇంటర్నెట్ షట్డౌన్ కారణంగానే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. కేంద్రం సరైన సమయంలో స్పందించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు.
మణిపూర్లో శాంతి భద్రతలు క్షీణించిపోయాయని, కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని షర్మిల కోరారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా షర్మిల అలుపెరుగని పోరాటం సాగించిన విషయం తెలిసిందే. ఆ చట్టం రద్దు కోసం 2000 నుంచి 2017 వరకు ఆమె నిరాహార దీక్ష చేశారు.