IRCTC Rameshwaram Package | దక్షిణ భారతదేశాన్ని సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో రామేశ్వరం, కన్యాకుమారి, మధురై, తిరువనంతపురం తదితర ప్రాంతాలను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ట్వీట్ చేసింది. దక్షిణ భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలను సందర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా ఎంతో మంది ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకుంటున్నారు. ఐఆర్సీటీసీ ఈ ప్యాకేజీని ‘సదరన్ డివైన్ టెంపుల్ బై ఫ్లైట్’ పేరిట తీసుకురాగా.. ఇందులో విమానంలో ప్రయాణించే అవకాశం లభించనున్నది.
ప్యాకేజీలో టూర్ మొత్తం ఆరు రోజులు, ఐదు రాత్రులు కొనసాగుతుందని ఐఆర్సీటీసీ తెలిపింది. ప్యాకేజీలో మధురై, త్రివేండ్రం, విశాఖపట్నం తదితర ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్యాకేజీ ఆగస్ట్ 12న ప్రారంభం కానున్నది. పర్యాటకులు విమానంలో కంఫర్ట్ క్లాస్లో ప్రయాణం, ఏసీ హోటల్లో బస ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. అల్పాహారంతో పాటు విందు సైతం ఏర్పాటు చేయనున్నది. దీంతో పాటు ముఖ్యంగా బీమా సౌకర్యం అందిస్తున్నది. అయితే టూర్ ప్యాకేజీలో ఒక్కరికి రూ.43,330గా తెలిపింది. అయితే, ఇద్దరు ప్యాకేజీలో వెళ్తే ఒక్కొక్కరు రూ.33,770, ముగ్గురు కలిసి బుక్ చేసుకుంటే ఒక్కొక్కరు రూ.32,350 చెల్లిస్తే సరిపోతుందని ఐఆర్సీటీసీ పేర్కొంది.