న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ కార్గో షిప్ను ఇరాన్ సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ షిప్లో ఉన్న 17 మంది భారతీయ సిబ్బంది(Indian crew)ని కలిసేందుకు భారత అధికారులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇరాన్ వెల్లడించింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ .. ఇరాన్ మంత్రి అమిర్ అబ్దొల్లియాన్తో ఈ అంశంపై మాట్లాడిన తర్వాత క్లారిటీ ఇచ్చింది. భారతీయ సిబ్బందిని కలిసేందుకు సహకరించాలని జైశంకర్ కోరినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సీజ్ చేసిన షిప్ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నామని, భారత ప్రభుత్వ ప్రతినిధులతో దీనిపై మాట్లాడనున్నట్లు అమిర్ అబ్దొల్లియాన్ తెలిపారు. శనివారం రోజున నౌకను పట్టుకున్నారు. దాంట్లో ఉన్న సిబ్బందిని అరెస్టు చేశారు. అయితే ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని జైశంకర్ కోరారు.