న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఐపీసీ, సీఆర్పీసీ, ఐఈఏల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన చట్టాల్లో సామాన్యులపై ప్రభావం చూపే పలు కీలక నిబంధనలు పొందుపరిచారు. పోలీస్ కస్టడీ కోరే సమయం పెంపు, నిందితుల ఆస్తులను అటాచ్ చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వడం తదితర నిబంధనలు ఉన్నాయి.
ప్రస్తుత చట్టాల ప్రకారం ఏదైనా కేసులో అరెస్టు అయిన వ్యక్తిని ఆ నాటి నుంచి 15 రోజుల వరకే కస్టడీకి కోరేందుకు వీలుంటుంది. కానీ ఈ బిల్లులో అరెస్టు అయిన 60-90 రోజుల మధ్యలో 15 రోజుల కస్టడీ కోరే అధికారం పోలీసులకు కల్పించారు.
బెయిల్ మంజూరు విషయంలో సామాన్యులకు ఊరట లభించలేదు. బెయిల్ తప్పనిసరి అనే నిబంధనను ఇందులో పొందుపర్చలేదు. అండర్ట్రయల్స్లో ఉండి సగం శిక్షను అనుభవించిన వారికి మాత్రమే తప్పనిసరి బెయిల్ పొందేందుకు వీలు ఉంది.
న్యాయ విచారణకు హాజరు కానివారు, పరారీలో ఉన్నవారిని తమ హక్కుగా ఉన్న న్యాయ విచారణను వదులుకున్నారని భావించి దోషులుగా పేర్కొనవచ్చు. 90 రోజుల వరకు నిందితులు కోర్టులో హాజరు కాకపోతే న్యాయ విచారణ ప్రారంభించవచ్చు.
విచారణలో భాగంగా డిజిటల్ ఆధారాలైన ఫోన్లు, ల్యాప్టాప్లను సీజ్ చేయవచ్చు. ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులను సాక్ష్యాలుగా కోర్టులో సమర్పించవచ్చు. ఈమెయిల్స్, సర్వర్ లాగ్స్, లొకేషన్, సందేశాలను సైతం పత్రాల రూపంలో సమర్పించే సాక్ష్యం మాదిరిగానే కోర్టులు పరిగణిస్తాయి.
ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నేరం చేసి సంపాదించిన సొమ్ముతో కూడగట్టిన ఆస్తిగా విచారణాధికారి భావిస్తే వాటిని అటాచ్ చేసే అధికారం అధికారికి ఉంటుంది.