Samajwadi | యూపీ బీజేపీలో ముసలం పుట్టింది. ఓ మంత్రితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడబలుక్కొని బీజేపీకి రాజీనామా చేశారు. దీంతో యూపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. దీంతో సమాజ్వాదీ పార్టీ పుండుమీద కారం చల్లేట్లు విమర్శలు చేస్తోంది. తాజాగా సమాజ్వాదీకి చెందిన సీనియర్ నేత, అధికార ప్రతినిధి ఐపీ సింగ్ బీజేపీకి ఓ చిత్రమైన బహుమానాన్ని ఆర్డర్ పెట్టారు. ఓ తాళం కప్పను ఆర్డర్ చేశారు. దీనిని బీజేపీ నేత స్వతంత్ర దేవ్ సింగ్కు అందజేయాలని ఆర్డర్లో పేర్కొన్నారు. అసెంబ్లీ తుది ఫలితాలు వెలువడ్డ తర్వాత… ఈ తాళాన్ని బీజేపీ కార్యాలయానికి వేయాలని ఆయన ఎద్దేవా చేశారు.
‘ఓం ప్రకాశ్ రాజ్భర్, జయంత్ చౌధరీ, రాజ్మాతా కృష్ణ పటేల్, సంజయ్ చౌహాన్.. తాజాగా స్వామి ప్రసాద్ మౌర్య… వీరందరూ పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తాళం కప్పను బహుమానంగా పంపా. మార్చి 10 తర్వాత ఈ తాళం కప్పను బీజేపీ కార్యాలయానికి వేసేయండి. మీరు ఇంటికి వెళ్లిపోండి. ఇది ఎస్పీ ప్రభంజనం ఎంత మాత్రము కాదు. ఇది ఓ తుపాన్’ అంటూ ఐపీ సింగ్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.