సంభల్: ఉత్తరప్రదేశ్లోని సంభల్లో (Sambhal) ఉద్రిక్తత కొనసాగుతున్నది. మసీదు సర్వే సందర్భంగా హింస చెలరేగడంతో నలుగురు యువకులు మరణించడంతోపాటు 30 మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉండటంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సంభల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్కూళ్లను బంద్ చేశారు. పట్టణంలో మొగల్ కాలానికి చెందిన జామా మసీద్ ఉన్నచోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో న్యాయస్థానం సర్వేకి ఆదేశించింది. దీంతో గత మంగళవారం నుంచి సంభల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం పెద్ద గుంపుగా వచ్చిన కొందరు సర్వేకు వ్యతిరేంగా మసీదు ముందు నినాదాలతో ఆందోళనకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ అల్లర్లలో ముగ్గురు యువకులు మరణించగా, 30 మంది పోలీసులు గాయపడ్డారు. రాళ్ల దాడిలో సీఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వీరిలో ఒక కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయం కాగా, డిప్యూటీ కలెక్టర్ కాలు విరిగింది.
పోలీసులపై కాల్పులు
న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు మొఘలుల కాలం నాటి షాహి జామా మసీదును సర్వే చేయడానికి ఆదివారం ఉదయం ఏడు గంటలకు అధికార బృందం రాగా, వారిని ఒక వర్గం అడ్డుకుంది. ఆందోళనకారులు పెద్దయెత్తున మసీదు వద్ద గుమిగూడి నినాదాలు చేయడం ప్రారంభించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించగా, అక్కడ ఉన్న మూక భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో అల్లరిమూకను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జితో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
అదే సమయంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. అల్లర్లకు సంబంధించి ఇద్దరు మహిళలు సహా పదిమందిని అదుపులోకి తీసుకున్నామని మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బీజేపీపై విమర్శలు చేశారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ, అధికార యంత్రాంగం ఈ హింసాత్మక ఘటనలకు కుట్ర పన్నారని ఆరోపించారు.