చండీగఢ్: కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దఎత్తున దేశ రాజధానికి రైతులు తరలిరావాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన హర్యానా (Haryana) ప్రభుత్వం.. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ (Mobile Internet) చేసింది. బల్క్ ఎస్ఎంఎస్ (Bulk SMS) లపై ఆంక్షలు విధించింది. అంబాలా, కురుక్షేత్ర, కైథాల్, జింద్, హిసార్, ఫతేబాద్, సిర్సా జిల్లాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 13వతేదీ రాత్రి 11.59 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది.
పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడంతోపాటు పలు డిమాండ్ల సాధనకు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కొన్ని సంఘాలు ఉద్యమబాట పట్టాయి. ఈ నెల 13న పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో పంజాబ్, హర్యానాలో మరోసారి టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. సరిహద్దు జిల్లాల బార్డర్లను ప్రభుత్వం మూసివేసింది. పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించింది. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.