న్యూఢిల్లీ, మే 24: అదానీ తాజా బొగ్గు స్కామ్పై అంతర్జాతీయ మీడియా సంస్థ ఫైనాన్సియల్ టైమ్స్ కథనం ప్రకంపనలు సృష్టిస్తున్నది. 2013లో ఇండోనేషియా నుంచి తక్కువ రకానికి చెందిన బొగ్గును దిగుమతి చేసుకొన్న అదానీ కంపెనీ.. దాన్ని హైగ్రేడ్ క్వాలిటీగా బురిడీ కొట్టించి తమిళనాడులోని ఓ ప్రభుత్వ విద్యుత్తు సంస్థకు అమ్మిన వైనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదానీ సంస్థ బొగ్గు కొనుగోలు వ్యవహారంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) పెండింగ్ కేసుపై విచారణ పూర్తి చేయాలని కోరుతూ 21 అంతర్జాతీయ సంస్థలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్కు తాజాగా లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. అదానీ కంపెనీ ఇండోనేషియా బొగ్గు దిగుమతి చేసుకొని, దాన్ని దేశంలో అధిక ధరలకు విక్రయించారన్న ఆరోపణలపై నిగ్గు తేల్చాలని అభ్యర్థించాయి. అదానీ బొగ్గు కహానీపై ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు(ఓసీసీఆర్పీ) పత్రాలను ఉటంకిస్తూ ఫైనాన్సియల్ టైమ్స్ కథనం ఇచ్చిన నేపథ్యంలో సీజేఐకి అంతర్జాతీయ సంస్థలు ఈ లేఖ రాశాయి.
సీజేఐ జస్టిస్ చంద్రచూడ్కు లేఖ రాసిన 21 అంతర్జాతీయ సంస్థల్లో ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్, బ్యాంక్ట్రాక్, బాబ్ బ్రౌడ్ ఫౌండేషన్, కల్చర్ అన్స్టెయినుడ్, ఇకో, ఎక్స్టిన్షన్ రెబలియన్, లండన్ మైనింగ్ నెట్వర్క్, ఫ్రెండ్స్ ఆఫ్ ది ఎర్త్ ఆస్ట్రేలియా, మెకే కన్జర్వేషన్ గ్రూప్, మార్కెట్ ఫోర్సెస్, మనీ రెబలియన్, మూవ్ బియాండ్ కోల్, సీనియర్స్ ఫర్ ైక్లెమేట్ యాక్సన్ నౌ, స్టాండ్.ఎర్త్, స్టాప్ అదానీ, సన్రైజ్ మూవ్మెంట్, టిప్పింగ్ పాయింట్, టాక్సిక్ బాండ్స్, ట్రాన్సరెన్సీ ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియా, డబ్ల్యూ అండ్ జే నగాన యార్బైన్ కల్చరల్ కస్టోడియన్స్, క్వీన్స్ లాండ్ కంజర్వేషన్ కౌన్సిల్ ఉన్నాయి. శిలాజ ఇంధనాల నిరంతర వినియోగానికి వ్యతిరేకంగా తాము గట్టిగా నిలబడుతామని ఈ సంస్థలు లేఖలో పేర్కొన్నాయి. అదానీ సంస్థ తక్కువ నాణ్యత బొగ్గును తమిళనాడుకు చెందిన టీఏఎన్జీఈడీసీవోకు అధిక ధరకు అమ్మిన వైనానికి సంబంధించి ఫైనాన్సియల్ టైమ్స్ తాజా, వివరణాత్మక ఆధారాలు ఇచ్చిందని తెలిపాయి.
తాజా బొగ్గు స్కామ్ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండిస్తున్నది. అయితే ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ వేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా విపక్షాలు ఫైనాన్సియల్ టైమ్స్ రిపోర్టును ఉటంకిస్తున్నాయి. కాగా, బొగ్గు దిగుమతుల అధిక ధరల ఆరోపణలపై అదానీ గ్రూప్పై విచారణను పునఃప్రారంభించాలన్న తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) కూడా ఇటీవల సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. 2011 నుంచి 2015 మధ్య అదానీ గ్రూపు కంపెనీలు ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకొన్న బొగ్గుకు సంబంధించి డీఆర్ఐ 2016లో దర్యాప్తును ప్రారంభించింది.