ముంబయి : గాన కోకిల లతా దీనానాథ్ మంగేష్కర్ పేరిట ఇంటర్నేషనల్ కాలేజీ ఆఫ్ మ్యూజిక్ అండ్ మ్యూజియాన్ని నెలకొల్పనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం రూ.100కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ప్రాజెక్టును ఆరుగురు వ్యక్తులకు కమిటీ పర్యవేక్షణలో జరుగనున్నారు. కమిటీకి లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ చైర్మన్గా పని చేయనున్నారు. కమిటీలో హృదయనాథ్తో పాటు ఉషా మంగేష్కర్, ఆదినాథ్ మంగేష్కర్, శివ కుమార్ శర్మ, మయూరేష్ పాయ్ ఉన్నారు.
మయూరేష్ మహారాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక డైరెక్టరేట్ డైరెక్టర్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా కాలేజీ ఏర్పాటుకు సంబంధించిన ప్రాజెక్టును స్వయంగా పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. లతాజీ పేరిట నెలకొల్పే కాలేజీ, మ్యూజియం నిర్మాణానికి స్థలాన్ని సైతం ఎంపిక చేశారు. లతా మంగేష్కర్ మరణానంతరం దాదర్లోని శివాజీ పార్క్లో ఆమె అంత్యక్రియలు జరిపి స్మారక చిహ్నం నిర్మించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కానీ, శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం ముంబైలోని కలీనాలోని బాంబే యూనివర్సిటీలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
లతా దీనానాథ్ మంగేష్కర్ ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ మ్యూజియాన్ని స్థాపించడానికి, నిర్వహించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం మొదట్లో ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఏర్పాటైన కోర్ కమిటీ ఇప్పటికే ఏర్పాటైన అధ్యయన కమిటీతో దీనిపై చర్చించి దాని సిఫార్సుల ఆధారంగా ఈ కళాశాల ఏర్పాటుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఈ కళాశాల కోసం గుర్తించిన భూమిని డైరెక్టరేట్కు బదిలీ చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది.
లతా మంగేష్కర్ హిందీ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం, గుజరాతీ, పంజాబీ, తెలుగు తదితర భాషల్లో తదితర వేల సంఖ్యల్లో పాటలు పాడారు. లతాజీ పేరిట కళాశాల, మ్యూజియం నెలకొల్పడంతో పాటు ఆమె పాడిన పాటలను భద్రపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లతా మంగేష్కర్ తాను పాడిన ప్రతి పాటను తన చేతితో పేపర్పై రాస్తూ, ఆ కాగితాలపై నోట్స్ సైతం రాసుకున్నారు. లతా మంగేష్కర్ జీవితకాలంలో ఉపయోగించిన వస్తువులు, వాయిద్యాలు, పుస్తకాలు, దేవుడి విగ్రహాలు సైతం మ్యూజియంలో భద్రపరచనున్నారు.