మార్చి 10 ఫలితాల తర్వాత తిరుగుబాటు!
గులాంనబీ ఇంట్లో సీనియర్ల మంతనాలు
భరత్సింహ్ సోలంకీ, పృథ్వీరాజ్చవాన్, కపిల్సిబల్,
భూపిందర్సింగ్ హుడా,ఆనంద్శర్మ హాజరు
సోనియా, రాహుల్ నాయకత్వంపై
నయా కాంగ్రెస్ కావాలన్న నినాదంతో వేర్పాటు
బీజేపీ చేతిలో పావులా ఆజాద్.. విశ్లేషకుల అనుమానం
భారత జాతీయ కాంగ్రెస్లో కల్లోలం రేగనున్నదా? మునుపెన్నడూ లేని స్థాయిలో నెహ్రూ-గాంధీ కుటుంబంపై కుట్రకు తెరలేస్తున్నదా? పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు తిరుగుబాటు చేయనున్నారా?
హైదరాబాద్, ఫిబ్రవరి 27 : త్వరలో రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్లో నయా కాంగ్రెస్ పేరిట పెద్ద ఎత్తున దుమారం రేగబోతున్నదని విశ్వసనీయవర్గాల సమాచారం. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న రాబోతున్నాయి. యూపీలో కాంగ్రెస్ అస్తిత్వమే ప్రమాదంలో పడబోతున్నదని వార్తలొస్తున్నాయి. పంజాబ్లో రెండోస్థానానికి పరిమితం కానున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గోవా, ఉత్తరాఖండ్లో అవకాశాలే లేవంటున్నారు. మణిపూర్లో కొన్ని ఆశలున్నప్పటికీ.. ఇతర పార్టీలు ఏ మేరకు సహకరిస్తాయన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడిన అనంతరం కాంగ్రెస్ అధినాయకత్వంపై తిరుగుబాటుకు సీనియర్ నేతలు సంసిద్ధులవుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ఇంట్లో పలువురు సీనియర్ నేతలు సమావేశమై ఇందుకు సంబంధించి వ్యూహరచన చేసినట్టు తెలిసింది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మాధవ్సింహ్ సోలంకీ కుమారుడు భరత్సింహ్ సోలంకీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్సింగ్ హుడాతో పాటు సీనియర్ నేతలు కపిల్సిబల్, ఆనంద్శర్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు సమాచారం. వీరంతా 2020 ఆగస్టులో జీ23 పేరుతో కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు కావాలంటూ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖాస్ర్తాన్ని సంధించినవారే. ఇటీవలి కాలంలో రాహుల్గాంధీ క్రమంగా బలపడుతున్నారు.. పార్లమెంట్లో ప్రధానమంత్రిపైన, బీజేపీ నాయకత్వంపైన.. రాహుల్ విరుచుకుపడిన ప్రసంగం దేశమంతా వైరల్గా మారింది. కేంద్రంలోని బీజేపీ సర్కారుపైనా, ప్రధానమంత్రి మోదీపైన రాహుల్గాంధీ ఒక్కరే ఒంటరిగా దాడి చేస్తున్నారని, మిగిలిన సీనియర్ నాయకులంతా మౌనంగా ఉండిపోయారని విశ్లేషకులంటున్నారు. ఈ క్రమంలో సోనియా, రాహుల్ నాయకత్వాన్ని బలహీనపరచడం లక్ష్యంగా కాంగ్రెస్లోని సీనియర్ల సహాయాన్ని తీసుకొని బీజేపీ నాయకత్వమే పావులు కదుపుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గులాంనబీ ఆజాద్ రక్తంలోనే కాంగ్రెస్ ఉన్నది. తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్కే ధారపోసిన నేత ఆయన. అటువంటి నాయకుడు సైతం తిరుగుబాటు చేయడం వెనుక కచ్చితంగా బీజేపీ హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. గులాంనబీ ఇంట్లో సమావేశమైన నేతలంతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పదవులు అనుభవించినవారే. అలాంటి నేతలే అధినాయకత్వంపై తిరుగుబాటుకు సిద్ధపడటం దారుణమని విశ్లేషకులు అంటున్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి, అధినాయకత్వానికి నిర్మాణాత్మక సలహాలిచ్చి తోడ్పాటును అందించాల్సిన నేతలు.. ఇలా తిరుగుబాటు బాట పట్టడంపై విస్మయం వ్యక్తంచేస్తున్నారు. గులాం నబీ ఆజాద్కు పద్మభూషణ్ పురస్కారాన్నివ్వడం, రాజ్యసభలో రిటైర్ అయిన సందర్భంగా ప్రధానమంత్రి కనీవినీ ఎరుగని రీతిలో ఆజాద్ను కొనియాడటం.. ఆయన సేవలను ఇతర మార్గాల్లో వినియోగించుకొంటామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు గులాంనబీ ఆజాద్ సైతం కశ్మీర్ విషయంలో ప్రధానమంత్రిని ప్రశంసించిన తీరు.. తన పార్టీ పట్ల ఆయన విధేయతను ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నదని వారు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ను సాధించి తీరుతామని మోదీ, షా ద్వయం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే బాహాటంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యూహంలో భాగంగానే ఆజాద్ను పావుగా మార్చుకొని.. కాంగ్రెస్పై ప్రయోగిస్తున్నదని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. మార్చి పది తరువాత భారీ ఎత్తున తిరుగుబాటుకు ఈ సీనియర్ నాయకులంతా వ్యూహరచన చేసినట్టు తెలిసింది. నయా కాంగ్రెస్ రావాలనే డిమాండ్తో వీరంతా పెద్ద ఎత్తున ఆందోళనకు తెరలేపనున్నట్టు సమాచారం.