న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం రోజున ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సహా ప్రముఖులే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకలకు ఐదు మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల అధినేతలను రిపబ్లిక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో పాక్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల నుంచి దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.
దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్, ఇతర నగరాల్లోనూ ఉగ్రవాదుల దాడులు జరిగొచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. ప్రజా సమూహాలు, రద్దీ ప్రదేశాలు, కీలక కట్టడాలు లక్ష్యంగా దాడులకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. డ్రోన్లతో దాడికి పాల్పడే అవకాశం ఉందని సమాచారం అందింది. ఉగ్ర దాడుల కుట్ర వెనుక లష్కరే తాయిబా, రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్-ఉల్-ముజాహిదీన్, హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ వంటి తీవ్రవాద సంస్థల హస్తం ఉన్నట్లు అంచనా. దాడులకు పాక్లోని ఖలిస్తానీ గ్రూపులు పంజాబ్లో దాడుల కోసం మానవ వనరులను సమీకరించుకుంటున్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది.