(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చే పోస్టులు ఇన్స్టాగ్రామ్లో ఇకపై కనిపించకపోవచ్చు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా మీరు ఒక పోస్టు చేశారనుకోండి.. సెకండ్ల వ్యవధిలోనే అది డిలీట్ అయిపోతుంది. ‘న్యూడిటి లేదా సెక్సువల్ కంటెంట్’ పేరిట ఏవేవో కారణాలు చెబుతూ ఆ పోస్టును సదరు సంస్థ ఆగమేఘాల మీద తొలగిస్తుంది. నిజం.. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పోస్టులపై ఆ పార్టీ ఐటీ సెల్ నేషనల్ కన్వీనర్ అమిత్ మాలవీయ రిపోర్ట్ చేయడమే ఆలస్యం.. ఎలాంటి సమీక్ష చేయకుండానే ఆయా పోస్టులు తొలగిస్తుండటం ఇన్స్టాగ్రామ్కు నిత్యకృత్యంగా మారింది. ఈ మేరకు ‘ది వైర్’ పరిశోధనాత్మక కథనాన్ని వెలువరించింది.
బయటపడింది ఇలా..
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ప్రభాకర్ మౌర్య అనే వ్యక్తి ఆ రాష్ట్రంలో ఓ గుడిని నిర్మించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నాడు. దీనిపై అక్కడి విపక్షాలు వ్యంగ్యంగా స్పందించాయి. బీజేపీపై తరచూ వ్యంగ్యంగా స్పందించే సూపర్హ్యూమన్స్ ఆఫ్ క్రింజ్టోపియా (@క్రింజ్ఆర్కివిస్ట్ హ్యాండిల్) ఖాతా నుంచి కొందరు ఈ వార్తను పోస్ట్ చేశారు. అయితే, న్యూడిటీ, సెక్సువల్ కంటెంట్ ఉన్నదన్న కారణంతో ఈ పోస్టును ఇన్స్టాగ్రామ్ తొలగించింది. నిజానికి ఆ పోస్ట్లో ఎలాంటి అభ్యంతరకరమైన కంటెంట్ లేదు. ఇదే విషయమై ‘వైర్’ ప్రతినిధులు మెటా (ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ) ప్రతినిధులను సంప్రదించారు. సదరు పోస్టును తొలగించడంలో సాంకేతిక పొరపాటు ఏమైనా తలెత్తిందా? అని ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదన్న ప్రతినిధులు.. బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ మాలవీయ ఆ పోస్టుపై ఫిర్యాదు చేయడంతో దాన్ని తొలగించినట్టు పేర్కొన్నారు. @క్రింజ్ఆర్కివిస్ట్ హ్యాండిల్లో పోస్ట్ అయిన ఏడు సందేశాలతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న దాదాపు 705 పోస్టులను గత నెలలో మాలవీయ రిపోర్ట్ చేశారని, వాటిని వెంటనే తొలగించినట్టు వెల్లడించారు.
అలా తొలగించవచ్చా?
ఏదైనా పోస్ట్ అభ్యంతరకరంగా ఉన్నట్టు ఎవరైనా ఫిర్యాదు చేసినట్లయితే, సదరు పోస్ట్పై ఇన్స్టాగ్రామ్ అంతర్గత రివ్యూ విభాగం సమీక్ష నిర్వహించాలి. అభ్యంతరకరంగా, సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆ పోస్ట్ ఉంటే, అప్పుడు ఖాతాదారుడికి సమాచారమిస్తూ ఆ పోస్ట్ను తొలగించాలి. అయితే, మాలవీయ రిపోర్ట్ చేసే ఏ పోస్టుపై కూడా సదరు సంస్థ ఎలాంటి సమీక్ష నిర్వహించట్లేదు. ఫిర్యాదు అందిన సెకండ్ల వ్యవధిలోనే ఆ పోస్టును ఏవేవో కారణాలు చెప్పి తొలగిస్తున్నది. ఇన్స్టాగ్రామ్ నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధమైన చర్య. మెటా తీసుకొచ్చిన వివాదాస్పద ‘ఎక్స్ చెక్ లేదా క్రాస్ చెక్’ ప్రోగ్రామ్లో భాగమైన సెలబ్రిటీ అకౌంట్ హోల్డర్లు అభ్యంతరం చెప్పే కంటెంట్ను ఇన్స్టా.. యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నట్టు సమాచారం. గొప్పగా ఫాలోవర్లు లేకపోయినా, ప్రజాదరణ ఉండకపోయినా ఆ ప్రోగ్రామ్లో మాలవీయ భాగస్వామిగా ఉన్నారు. కారణం.. ఇన్స్టాపై అధికార బీజేపీ ఒత్తిడే. అందుకే, మాలవీయ సూచించిన పోస్టులను ఇన్స్టా సమీక్షించకుండానే తొలగిస్తున్నది. ‘ఎక్స్ చెక్’ ప్రోగ్రామ్పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూర్చేలా ఇన్స్టా చర్యలు ఉన్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు ధ్వజమెత్తారు. ‘మాలవీయ రిపోర్టింగ్-ఇన్స్టా డిలీటింగ్’ చర్య రానున్న ఎన్నికల్లో ఓటర్లను, విపక్ష పార్టీలను ప్రభావితం చేసే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.