న్యూఢిల్లీ: దేశంలో ప్రబలుతున్న అన్యాయంపై పోరాడేందుకు ‘ఇన్సాఫ్’ పేరుతో కొత్త వేదికను ప్రారంభిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రకటించారు. ప్రజలు, సంస్థలు, జర్నలిస్టులు, ప్రతిపక్షాలు, ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతున్నదని ఆయన అన్నారు. కేంద్రం ఈడీని ఉపయోగించుకొని ప్రతిపక్షాలను అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు. న్యాయవాదులు కీలక భూమిక పోషించనున్న తమ ‘ఇన్సాఫ్’ ద్వారా అన్యాయానికి గురవుతున్న వారికి అండగా పోరాడుతామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జాతీయ స్థాయిలో పనిచేసే ఈ వేదికకు ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, నేతలు మద్దతు ఇవ్వాలని కోరారు. ‘ఇన్సాఫ్’కు తమ మద్దతు ఉంటుందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.