న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ తొలి డోసు పరంగా చూసుకుంటే అమెరికా కంటే కూడా ఎక్కువ వ్యాక్సిన్లు ఇండియానే ఇచ్చిందని చెప్పారు ప్రభుత్వ టాస్క్ఫోర్స్ చీఫ్ వీకే పాల్. ఇప్పటి వరకూ ఇండియాలో తొలి డోసు తీసుకున్న వారి సంఖ్య 17.2 కోట్లుగా ఉన్నదని ఆయన తెలిపారు. ఆ లెక్కన అమెరికాను మించిపోయినట్లు పాల్ చెప్పారు.
ఇక కొవిడ్ కేసులు తగ్గుతున్నాయి కదా అని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని కూడా ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ప్రజలంతా మళ్లీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎలా ఉన్నారో అలాగే చేస్తున్నారు. వైరస్ మళ్లీ వచ్చే ప్రమాదం ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ సమయం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని పాల్ సూచించారు.