ముంబై: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా ఫూలేపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్పై నిరసనకారులు ఇంకు చల్లారు. పూణేలోని పింప్రీ శివారులో శనివారం ఈ సంఘటన జరిగింది. ఒక ఇంటి నుంచి బయటకు వస్తున్న మంత్రి చంద్రకాంత్ పాటిల్ వద్దకు ఒక వ్యక్తి వెళ్లాడు. ఆయన ముఖంపై నల్ల రంగు సిరాను చల్లాడు. దీంతో మంత్రి వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించారు. చంద్రకాంత్ పాటిల్పై ఇంకు చల్లిన వ్యక్తితోపాటు మరొకరిని పట్టుకుని అరెస్ట్ చేశారు. మంత్రిని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు.
కాగా, మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి అయిన చంద్రకాంత్ పాటిల్ ఇటీవల ఔరంగాబాద్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలేపై వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఆయన ముఖంపై సిరా చల్లి నిరసన తెలిపాడు.
మరోవైపు తనపై జరిగిన సిరా దాడిపై బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్ స్పందించారు. ‘నేను యోధుడ్ని. ఇలాంటి పిరికిపంద చర్యలకు భయపడను’ అని అన్నారు. ‘కంటికి చుక్కల మందు వాడాను. ఇప్పుడు పూర్తిగా బాగున్నాను’ అని తెలిపారు. అలాగే ప్రశాంతంగా ఉండాలని బీజేపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ‘తనపై జరిగిన దాడి తప్పు కాదా?’ అని ఎన్సీపీ నేతలు శరద్ పవార్, అజిత్ పవార్, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేను ఆయన ప్రశ్నించారు.
అయితే బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్ ముఖంపై ఇంకు చల్లిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Ink thrown on BJP leader and Minister Chandrakant Patil after he made statement on Bharat Ratna #BabasahebAmbedkar in Pimpri Chinchwad,Pune pic.twitter.com/rEChunDgOF
— Pramod Sharma (प्रमोद शर्मा) (@ipramodsharma) December 10, 2022