న్యూఢిల్లీ: మంత్రి కుమారుడిపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన మహిళపై ఇద్దరు వ్యక్తులు ఇంక్తో దాడి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. రాజస్థాన్ మంత్రి మహేశ్ జోషి కుమారుడు రోహిత్ జోషి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల మహిళ ఆరోపించింది. ఏడాది కిందట ఫేస్బుక్లో పరిచయమైన అతడు పెళ్లి పేరుతో తనను లొంగదీసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో రోహిత్ను అరెస్ట్ చేసేందుకు రాజస్థాన్కు వెళ్లారు. అయితే అతడు అక్కడ లేకపోవడంతో తిరిగి వచ్చారు. కాగా, ఢిల్లీ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన రోహిత్ జోషి శనివారం ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
మరోవైపు రోహిత్ జోషిపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన మహిళ శనివారం దక్షిణ ఢిల్లీలోని కాళింది కుంజ్ రోడ్లో తల్లిలో కలిసి నడిచి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెపై ఇంక్తో దాడి చేశారు. ఆమె శరీరం, దుస్తులపై సిరా చల్లి పారిపోయారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆమెను ఎయిమ్స్కు తరలించారు. ఆమెపై చల్లిన నీలం ద్రవం ఇంక్గా పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇంక్ దాడి నిందితులను గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.