Ram Mandir | అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది. జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే దేశంలోని రాజకీయ, పారిశ్రామిక, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపింది. శ్రీరామ జన్మభూమి ట్రస్టు సభ్యులు ప్రముఖుల నివాసాలకు వెళ్లి ఆహ్వానించారు.
ఈ మహోత్తర వేడుకకు దాదాపు 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ అథితుల జాబితాలో ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, బ్యూరోక్రాట్లు, దౌత్యవేత్తలు ఉన్నారు. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రత్యేక ప్రయివేటు చార్టెడ్ ప్లేన్లో కుటుంబ సభ్యులతో అయోధ్యకు వెళ్లనున్నారు.
సినీ ఇండస్ట్రీ నుంచి అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, మోహన్ లాల్, అనుపమ్ ఖేర్, చిరంజీవి, అంజద్ అలీ, మనోజ్ ముంతాషీర్, ప్రసూన్ జోషి, డైరెక్టర్లు సంజయ్ భన్సాల్, చంద్రప్రకాశ్ ద్వివేదితో పాటు పలువురు ఉన్నారు.
పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, ఆయన తల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కోడలు శ్లోకా, కాబోయే మరో కోడలు రాధిక మర్చంట్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆయన భార్య నీరజ, పిరమల్ గ్రూప్ చైర్పర్సన్ అజయ్ పిరమల్, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, డీసీఎం శియారాం అధినేత అజయ్ శియారాం, టీసీఎస్ సీఈవో కే కృతివసన్ హాజరు కానున్నారు.
డాక్టర్ రెడ్డీస్ ఫార్మాస్యూటికల్స్ నుంచి కే సతీశ్ రెడ్డి, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ సీఈవో పునీత్ గోయెంకా, ఎల్ అండ్ టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఆయన భార్య దురాలి దివి, ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి, జిందాల్ స్టీల్ అండ్ పవర్ హెడ్ నవీన్ జిందాల్, మేదాంత గ్రూప్ చైర్మన్ నరేశ్ త్రెహాన్ ఉన్నారు.
లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, మాజీ అటార్నీ జనరల్స్ కేకే వేణుగోపాల్, ముకుల్ రోహత్గీ, ఇండియన్ వుమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా హాజరు కానున్నారు.