న్యూఢిల్లీ : సామాన్య ప్రజలకు ఇది పిడుగులాంటి వార్తే. ఇప్పటికే వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇండోనేషియా పామాయిల్ ఎగుమతిపై నిషేధం విధించింది. ఈ నెల 28వ తేదీ నుంచి నిషేధం అమలులోకి రానుండగా.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. భారత్ పెద్ద మొత్తం పామాయిల్ను దిగుమతి చేసుకుంటున్న తరుణంలో.. ఎగుమతులపై నిషేధం విధించడంతో మరింత ధరలు పెరిగే అవకాశం ఉన్నది.
ఇండోనేషియా మొత్తం ప్రపంచంలోనే పామాయిల్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నది. ఆ తర్వాత మలేషియా రెండోస్థానంలో ఉన్నది. అయితే, పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు అధ్యక్షుడు జోకో విడోడో శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం భారత్ దాదాపు 9 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నది. ఇందులో 70శాతం పామాయిల్ను ఇండోనేషియా నుంచి భారత్కు వస్తున్నది. అయితే, 30శాతం మలేషియా నుంచి దిగుమతి అవుతుంది.
2020-21లో భారత్ 83.1లక్షల టన్నుల పామాయిల్ను దిగుమతి చేసుకున్నది. తాజాగా ఇండోనేషియా నిర్ణయంతో భారత్ పామాయిల్ దిగుమతి తీవ్రంగా ప్రభావితం కానున్నది. ఇకపై మలేషియాపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, దీని ప్రత్యక్ష ప్రభావం ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న సామాన్య ప్రజలపై ఉండనున్నది.
నివేదికల ప్రకారం.. ఇండోనేషియా నిర్ణయం నేపథ్యంలో ప్రపంచ ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తర్వాత రికార్డు స్థాయికి చేరింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్ ఆయిల్ సరఫరాకు అంతరాయం కలుగడంతో దేశంలో ఆవాల నూనె ధర ఎక్కువగానే ఉన్నది. తాజాగా ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులను నిలిపివేసిన నేపథ్యంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పామాయిల్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ కింద 2025-26 నాటికి భారత్లో పామాయిల్ ఉత్పత్తిని మూడు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
గత జనవరిలోనూ ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులను నిలిపివేసింది. ఆ తర్వాత మార్చిలో బ్యాన్ను ఎత్తివేసింది. ప్రస్తుతం ఈ నెల 28 నుంచి నిషేధం అమలులోకి రానుండగా.. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే వంటనూనె ధరలు మండిపోతున్న తరుణంలో ఇండోనేషియా నిర్ణయంతో మరింత భారంగా మారనున్నది. నిషేధం సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మాట్లాడుతూ దేశంలో ఎడిబుల్ ఆయిల్ సరఫరా తగింత ఉండాలని, ధర తక్కువ ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.