న్యూఢిల్లీ, జూన్ 8: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ హత్యను హర్షిస్తూ కెనడాలో కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు ఉరేగింపు తీయడం, సంబురాలు చేసుకోవడం సంచలనంగా మారింది. జూన్ 4న అక్కడి బ్రాంప్టన్లో జరిగినట్టుగా భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ ఘటనపై భారత్ అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఇలాంటి చర్యలు ఏ మాత్రం సమ్మతం కాదని తెలియజేస్తూ ఒట్టావాలోని భారత హైకమిషన్ కెనెడా విదేశాంగ శాఖకు అధికారిక నోట్ పంపించింది. బ్రాంప్టన్ ఘటనపై భారత్లోని కెనడా హైకమిషనర్ మెక్కే స్పందించారు. కెనెడాలో విద్వేషానికి, హింసను కీర్తించడానికి చోటు లేదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్వీట్ చేశారు.