ఇండిగో సంస్థ నిర్వాకం.. సర్వత్రా విమర్శలు
ఖండించిన సింధియా.. దర్యాప్తునకు ఆదేశం
బాలుడు భయపడటం వల్లే ఆ నిర్ణయం: ఇండిగో
న్యూఢిల్లీ, మే 9: దివ్యాంగుడైన ఓ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సంస్థ నిరాకరించింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా స్పందించారు. ఘటనపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. ఇందుకోసం డీజీసీఏ ముగ్గురు సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని తెలిపింది. శనివారం హైదరాబాద్ వెళ్లడానికి ఓ కుటుంబం జార్ఖండ్లోని రాంచీ ఎయిర్పోర్టుకు చేరుకొన్నది. కుటుంబంలోని దివ్యాంగుడైన బాలుడిని విమానం ఎక్కనివ్వకపోవడంతో ఆ కుటుంబం ప్రయాణాన్ని రద్దు చేసుకొన్నది. ఈ విషయాన్ని అక్కడే ఉన్న మనీషా గుప్తా అనే మరో ప్రయాణికురాలు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
అమానవీయ ఘటనగా అభివర్ణించారు. ఇది వైరల్ అయింది. అయితే, దీనిపై ఇండిగో మరో రకమైన వివరణ ఇచ్చింది. బాలుడు విమానం ఎక్కడానికి భయపడటం వల్లనే తాము ఆ నిర్ణయం తీసుకొన్నామని తెలిపింది. బాలుడి భయం పోగొట్టడానికి చాలా ప్రయత్నించామని, ఫలితం లేకపోవడంతో వారు ఎక్కకుండానే విమానం టేకాఫ్ అయిందని పేర్కొన్నది. ఈ ఘటనపై ఇండిగో సీఈవో రోనోజాయ్ దత్త పశ్చాత్తాపం ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సందర్భానికి తగిన విధంగా తమ సిబ్బంది ఆ విధంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. సదరు బాలుడికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కొనిస్తానని తెలిపారు.