తిరువనంతపురం, డిసెంబర్ 7: భారత్లో అత్యంత తీవ్రమైన వడగాడ్పులు మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేయనున్నాయని ప్రపంచబ్యాంకు హెచ్చరించింది. ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన వడగాడ్పులు భారత్లో నమోదు కానున్నాయని ‘ైక్లెమేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియాస్ కూలింగ్ సెక్టార్’ నివేదికలో పేర్కొన్నది.
కేరళ ప్రభుత్వంతో కలిసి తిరువనంతపురంలో నిర్వహిస్తున్న ‘ఇండియా ైక్లెమేట్ అండ్ డెవలప్మెంట్ పార్టనర్స్ మీట్’ సదస్సులో ప్రపంచబ్యాంకు ఈ నివేదిక విడుదల చేసింది. ‘భారీ వడగాడ్పులు భారత్లో ఊహించినదానికంటే ముందుగానే మానవ మనుగడకు అవసరమైన పరిస్థితులను దెబ్బతీయనున్నాయి’ అని నివేదికలో వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా వడగాడ్పులతో వేల మంది మరణించారని, భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండనున్నదని వివరించారు. దేశవ్యాప్తంగా 2022లో ఉష్ణోగ్రతలు గరిష్ఠస్థాయిలో నమోదయ్యాయని తెలిపారు.
2030 నాటికి తీవ్ర స్థాయికి ఎండలు
బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు 2030 నాటికి తీవ్ర ఎండను భరించాల్సి వస్తుందని నివేదిక తెలిపింది. భారత శ్రామికుల్లో దాదాపు 75% (38 కోట్ల మంది) ప్రాణాంతక ఉష్ణోగ్రతల మధ్య పనిచేయాల్సి వస్తుందని వెల్లడించింది. వడగాల్పుల కారణంగా 2030నాటికి భారత్లో 3.4 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని తెలిపింది. దక్షిణాసియా దేశాలు ఏటా 10 వేల కోట్ల పనిగంటలను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది.