ధరలు కొండెక్కుతున్నాయి. ఎగుమతులు క్షీణిస్తున్నాయి. ఫారెక్స్ నిల్వలు పడిపోతున్నాయి. విక్రయాలు మందగించాయి. వాణిజ్యలోటు అంతకంతకూ పెరిగిపోతున్నది. తగిన ఉపాధిలేక శ్రామికశక్తి నిర్వీర్యమవుతున్నది. తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో దేశం అధోగతిపాలైందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్ను ప్రపంచానికే ‘విశ్వగురు’గా మార్చారని, భారత్ ‘సూపర్ పవర్’గా మారుతున్నదని గప్పాలకుపోతూ బీజేపీ పరివారం చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని తేలింది. దేశ ఆర్థిక రంగానికి కీలకమైన ఆరు అంశాల్లో భారత్ నమోదుచేసిన గణాంకాలను విశ్లేషిస్తే ఇది అర్థమవుతుంది. ఆగస్టు 2022, జూలై 2023 మధ్య పలు అంశాల్లో భారత్ ట్రాక్ రికార్డు దీనావస్థగా ఉండటం కలవరపెడుతున్నది.
ఆహారోత్పత్తుల ధరలు భగ్గుమంటున్నాయి. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠస్థాయి 7.44 శాతానికి చేరినట్టు కేంద్రగణాంకాల శాఖ నేతృత్వంలోని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ తెలిపింది. టోకు ఆహారోత్పత్తుల ధరల క్యాటగిరీలో ఏడాది వ్యవధిలో కూరగాయల ధరలు 62.12 శాతం పెరుగడం కలవరపెడుతున్నది.
దేశంలో యువ శ్రామిక శక్తి కావాలసినంతగా ఉన్నప్పటికీ, నైపుణ్యానికి తగిన ఉపాధి దొరక్కపోవడంతో ఉత్పదకశక్తి నిర్వీర్యమవుతున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు అర్హతలకు తగిన ఉద్యోగం కావాల్సినవారు 22 కోట్ల మంది వరకు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏడాది వ్యవధిలో విపణిలో శ్రామికశక్తి రేటు 39.3 శాతం మేర తగ్గింది. ఉద్యోగ కల్పనలేమే దీనికి ప్రధాన కారణం.
గడిచిన మూడేండ్లలో ఎన్నడూ లేనంతగా జూలైలో ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. గడిచిన నెలలో ఎగుమతులు 23 శాతం క్షీణించి 32.25 బి.డాలర్లకు తగ్గాయి. 2020 మేలో ఎగుమతులు 33.47 శాతం క్షీణించగా ఈ స్థాయిలో తగ్గడం మళ్లీ ఇప్పుడే. ఏడాది వ్యవధిలో ఎగుమతుల్లో క్షీణత 23 శాతంగా నమోదైంది.
విదేశీ మారకపు నిల్వలు ఆవిరైపోతున్నాయి. ఫారెక్స్ రిజర్వుల పతనానికి అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. గతనెల చివరి నాటికి ఈ నిల్వలు 1.987 బిలియన్ డాలర్లమేర క్షీణించి 607 బిలియన్లకు పడిపోయాయి. ఏడాది వ్యవధిలో మొత్తంగా 11.3 శాతం మేర క్షీణించాయి.
పెరిగిన ధరలు, ఉద్యోగాల్లో కోత వెరసి ప్యాసింజర్ వెహికిల్ విక్రయాలు అంతకంతకూ క్షీణించసాగాయి. ఏడాది వ్యవధిలో విక్రయాలు 22.2 శాతం మేర మందగించినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయానికి అవసరమైన ట్రాక్టర్ల విక్రయాలు కూడా తగ్గుముఖం పట్టాయి. బ్రాడ్బ్యాండ్ సబ్స్ర్కైబర్ల సంఖ్య కూడా ఏడాది వ్యవధిలో 7.8 శాతం మేర తగ్గింది.
దేశ ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం ఎంతకూ దిగిరావడం లేదు. ఒకవైపు దిగుమతులు ఆకాశాన్నంటుతుంటే, ఎగుమతులు నేలచూపులు చూస్తున్నాయి. దీంతో వాణిజ్యలోటు ఏడాదిన్నర వ్యవధిలో మూడింతలైంది. గత జూలైలో వాణిజ్యలోటు రూ. 1.72 లక్షల కోట్లకు చేరుకున్నది. అంతకుముందు నెలతో పోలిస్తే ఇది రూ.5 వేల కోట్లు ఎక్కువ.