సిమ్లా : స్వాతంత్ర్యానంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఓటు వేసిన శ్యాం శరణ్ నేగి 106 ఏండ్ల వయసులో ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కిన్నౌర్ జిల్లాకు చెందిన శ్యాం శరణ్ నేగి కోసం ఎన్నికల కమిషన్ బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
రెడ్ కార్పెట్తో స్వాగతిస్తూ ఆయనను ఓటు వేసేందుకు చర్యలు చేపట్టామని కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అబిద్ హుస్సేన్ తెలిపారు. శ్యాం శరణ్ నేగి ఓ లెజెండ్ అని ఆయనకు తగ్గట్టే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామని చెప్పారు. తొలుత పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలని శ్యాం శరణ్ భావించారని, ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటి నుంచి ఓటు వేసేందుకు అనుమతించాలని దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
పెద్ద వయసులోనూ తన తండ్రి ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటూ యువతలో స్ఫూర్తి నింపుతున్నారని నేగి చిన్న కుమారుడు చందన్ ప్రకాష్ చెప్పుకొచ్చారు. 1951లో తన తండ్రి ఓటు వేశారని, ఈ వయసులోనూ పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకుంటూ తన విధి నిర్వర్తిస్తున్నారని అన్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12న జరగనుండగా డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.