న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా విరుచుకుపడుతూ పలువురి ప్రాణాలు హరిస్తున్న కొవిడ్ సెకండ్ వేవ్ మే ప్రధమార్ధంలో ముమ్మర దశకు చేరుకుని మాసాంతానికి తగ్గుముఖం పడుతుందని ఐఐటీ సైంటిస్టులు వెల్లడించారు. ఐఐటీ శాస్త్రవేత్తలు రూపొందించిన గణాంక పద్థతి ప్రకారం ప్రస్తుతం 24.28 లక్షలుగా ఉన్న కొవిడ్ యాక్టివ్ కేసులు మే 15 నాటికి పది లక్షలు పెరిగి 33-35 లక్షలకు ఎగబాకుతాయని ఆపై క్రమంగా దిగివస్తాయని వెల్లడైంది.
ఐఐటీ కాన్పూర్, ఐఐటీ హైదరాబాద్ కు చెందిన శాస్త్రవేత్తలు అనుమానిత, గుర్తించని, టెస్టెడ్ (పాజిటివ్), రిమూవ్డ్ అప్రోచ్ (సూత్ర) మోడల్ లో ఈ అంచనాకు వచ్చారు. ఏప్రిల్ 25-30 నాటికి ఢిల్లీ, హర్యానా, రాజస్ధాన్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక తాజా కేసులు వెలుగుచూస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు ఇప్పటికే నూతన కేసుల్లో ముమ్మర దశకు చేరాయని పేర్కొంది. మే మాసాంతానికి కొవిడ్ కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుందని ఐఐటీ కాన్పూర్ సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు.