న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా ఉన్న భారత్లో పత్తి ఉత్పత్తి ఈ ఏడాది బాగా తగ్గిపోయే అవకాశం ఉన్నది. దేశీయ అవసరాలకూ మన ఉత్పత్తి సరిపోయేలా కనిపించడం లేదు. 2022-23లో దేశంలో పత్తి ఉత్పత్తి 14 ఏండ్ల కనిష్టానికి తగ్గిపోవచ్చని కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఏఐ) అంచనా వేసింది. వరుసగా రెండో ఏడాది కూడా దేశీయ వినియోగం కంటే తక్కువగా పత్తి ఉత్పత్తి ఉండనున్నదని తెలిపింది. పంట దిగుబడి తగ్గడమే ప్రధాన కారణమని పేర్కొన్నది.
ఈ ఏడాది 344 లక్షల పత్తి ఉత్పత్తి అవుతుందని గతంలో కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ఆ తర్వాత ఈ అంచనాను 313 లక్షల బేళ్లకు తగ్గించింది. ఇప్పుడు ఇంతకంటే 3.2 శాతం తక్కువగా ఉత్పత్తి ఉండొచ్చని, 303 లక్షల బేళ్ల(ఒక్క బేలు=170 కిలోలు) పత్తి మాత్రమే ఈసారి ఉత్పత్తి అవుతుందని సీఏఐ పేర్కొన్నది. దేశీయ పత్తి వినియోగం కూడా గత ఏడాది కంటే 2.2 శాతం తగ్గి 311 లక్షల బేళ్లకు చేరుకుంటుందని సీఏఐ పేర్కొంది. దీంతో దేశీయ ఉత్పత్తి కోసం కూడా కొంతమేర విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. 2022-23 మార్కెటింగ్ సంవత్సరం చివరి నాటికి పత్తి నిల్వలు 14 లక్షల బేళ్లకు తగ్గుతుందని సీఏఐ అంచనా వేసింది.