న్యూఢిల్లీ, మార్చి 10: స్విట్జర్లాండ్, నార్వే, ఐస్ల్యాండ్, లిచెన్స్టీన్ దేశాలతో కూడిన యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్టీఏ) రానున్న 15 ఏండ్లలో భారత్లో 100 బిలియన్ డాలర్ల (రూ.8,27,523 కోట్ల) పెట్టుబడులు పెట్టడంతోపాటు 10 లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నది. ఇందుకు సంబంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)పై భారత్, ఈఎఫ్టీఏ ఆదివారం సంతకాలు చేశాయి. రెండు ప్రాంతాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టెపా) పేరుతో దీన్ని కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందంతో దేశీయ పరిశ్రమల్లో తయారయ్యే అన్ని రకాల వస్తువులు ఎలాంటి సుంకం లేకుండానే ఈఎఫ్టీఏ దేశాల్లో అందుబాటులోకి రావడంతోపాటు ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు పన్ను రాయితీలు లభిస్తాయి. కాగా, స్విట్జర్లాండ్ ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుంచే అన్ని రకాల పారిశ్రామిక వస్తువులపై సుంకాలను తొలగించింది. దీంతోస్విస్ వాచ్లు, చాక్లెట్లు, గడియారాలు భారత్లో తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.