ముంబై, జనవరి 25: అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ రిసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ రిసెర్చ్ చేసిన ఆరోపణలు దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించాయి. అదానీ గ్రూప్ స్టాక్ అవకతవకలకు పాల్పడిందన్న వార్తల మధ్య బుధవారం అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కుప్పకూలాయి. సెన్సెక్స్ 773.69 పాయింట్లు లేదా 1.27 శాతం పతనమై 60,205.06 వద్ద ముగిసింది. ఒకానొక దశలో దాదాపు 900 పాయింట్ల వరకు క్షీణించిన సూచీ.. 60,081.36 వద్దకు దిగజారడం గమనార్హం. ఇక నిఫ్టీ 226.35 పాయింట్లు లేదా 1.25 శాతం పడిపోయి 18,000 స్థాయికి దిగువన 17,891.95 వద్ద నిలిచింది. స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్నకు చెందిన కంపెనీల షేర్లే సుమారు 10 వరకు ఉండగా, అవన్నీ కూడా నష్టాలకే పరిమితమయ్యాయి.
మార్కెట్లు ఉదయం ఆరంభం దగ్గర్నుంచీ నష్టాల్లోనే కదలాడాయి. మదుపరులు అమ్మకాల ఒత్తిడిలోకి జారుకోవడంతో అన్ని ప్రధాన రంగాల షేర్లు నిరాశాజనకంగానే ట్రేడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లన్నీ కుదేలయ్యాయి. దీంతో సెన్సెక్స్లోని 30 షేర్లలో 22 నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 1.52 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.94 శాతం పడిపోయాయి. కాగా, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణలు, ఎఫ్అండ్వో డెరివేటివ్స్ గడువు ముగియడం కూడా మార్కెట్ లాభాలకు గండికొట్టాయి. అయితే అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల ఎఫ్పీవోకు ముందు హిండెన్బర్గ్ ఆరోపణలు మార్కెట్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాబోయే ఎఫ్పీవో విజయాన్ని ఇవి ప్రభావితం చేయవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు.
యుటిలిటీస్, పవర్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలీ కమ్యూనికేషన్స్, చమురు-గ్యాస్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ వంటి ప్రధాన రంగాలకు చెందిన సంస్థల షేర్లన్నీ 2.87 శాతం నుంచి 1.06 శాతం మేర నష్టపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ షేర్ విలువ అత్యధికంగా 4.3 శాతం ఆవిరైపోయింది. ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్టీ, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లూ దెబ్బతిన్నాయి.