ISRO | బెంగళూరు, మార్చి 21: రోదసి ప్రయాణాలు అత్యంత సులభతరం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం అత్యంత కీలకమైన ప్రయోగాన్ని చేపట్టింది. పునర్వినియోగ రాకెట్ ‘పుష్పక్ విమాన్’ను కర్ణాటకలోని రక్షణశాఖకు చెందిన ‘చాలకెరె రన్వే’ నుంచి ఉదయం 7 గంటలకు ప్రయోగించనున్నట్టు ఇస్రో తాజాగా వెల్లడించింది. అత్యంత సంక్లిష్టమైన ‘రొబోటిక్ ల్యాండింగ్’ సామర్థ్యాన్ని సాధించేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపడుతున్నది.
ఈ సందర్భంగా ఇస్రో చైర్మెన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ, ‘భవిష్యత్ పునర్వినియోగ లాంచ్ వెహికల్ (ఆర్ఎల్వీ) ఇది. రాకెట్ భూమిపైకి సురక్షితంగా చేరాక.. అందులోని అత్యంత ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాల్ని తిరిగి వాడతాం’ అని చెప్పారు. ఆర్ఎల్వీ ప్రయోగాల్లో ఇస్రోకు ఇది మూడోది. 6.5 మీటర్ల పొడవు, 1.75 టన్నుల బరువుండే ‘పుష్పక్’ను ఆకాశంలో ఓ ఐఏఎఫ్ హెలికాప్టర్ నుంచి భూమిపై నిర్దేశిత లక్ష్యం వైపు ప్రయోగిస్తారు.