Heart Attack | హైదరాబాద్, జూన్ 22 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పశ్చిమ దేశాల వారితో పోలిస్తే పదేండ్ల ముందుగానే భారతీయులు గుండె సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదమున్నదని అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా(ఏపీఐ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. మిగతా వారితో పోలిస్తే కొరొనరీ ఆర్టెరీ డిసీజ్ వంటి గుండె జబ్బులతో భారతీయులు మరణించే ప్రమాదం 20-50 శాతం మేర ఎక్కువగా ఉన్నదని ఏపీఐ అధ్యక్షుడు డాక్టర్ మిలింద్ వై నాడ్కర్ తెలిపారు. గత 30 ఏండ్లలో గుండె సంబంధిత మరణాలు దేశంలో రెట్టింపయ్యాయని చెప్పారు.
చెడు కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అమితంగా తీసుకోవడం, జన్యుక్రమం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, మద్యపానానికి బానిసలవ్వడం వంటి కారణాలతో పశ్చిమ దేశాల వారితో పోలిస్తే, భారతీయుల్లో గుండెజబ్బులు పదేండ్ల ముందుగానే వస్తున్నట్టు ఢిల్లీలోని అపోలో దవాఖాన వైద్యుడు డాక్టర్ ముకేశ్ గోయల్ తెలిపారు. ఈ అలవాట్ల వల్లే యువత కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారని వెల్లడించారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. 2022 ఒక్క ఏడాదిలోనే భారత్లో గుండెపోటుతో 32,457 మంది మరణించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 12.5 శాతం ఎక్కువ.
