న్యూఢిల్లీ, జూలై 19: చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు ప్రగల్భాలు పలుకడంలో, గప్పాలు కొట్టుకోవడంలో ప్రధాని మోదీది అందెవేసిన చెయ్యి. ఇది వినండీ.. ఇది కనండీ.. అంటూ దానికి మోదీ అనుయాయలు, బీజేపీ నేతలు చేసే హడావుడి అంతాఇంతా కాదు! మోదీ ప్రధాని అయిన తర్వాత.. అంతకుముందు కూడా అటువంటి గొప్పలు తుస్సుమన్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. భారత పౌరసత్వం వదులుకొని లక్షలాది మంది విదేశాలకు వెళ్లిపోతున్న ఆందోళనకర అంశం ఆ కోవలోకే వస్తుంది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో నరేంద్ర మోదీకి అమెరికా ప్రవేశాన్ని తొమ్మిదేండ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.
అమెరికా వీసా కోరుతారా? అని 2013, జూలైలో బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోదీని ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘నేను ప్రధానిగా అయితే భారతదేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతా! అప్పుడు అమెరికన్లు అందరూ భారత వీసా కోసం క్యూలో నిలబడుతారు..’ అంటూ గొప్పగా ప్రగల్భాలు పలికారు. కానీ వాస్తవ రూపం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. వీసాల కోసం క్యూలో కొట్టుకునే వారి సంగతి అటుంచితే.. దేశాన్ని, పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాలకు వెళ్లిపోతున్న భారతీయుల సంఖ్య లక్షల్లో ఉంటున్నది. గత ఏడు సంవత్సరాల్లో ఈ ట్రెండ్ మరీ ఎక్కువైందని సాక్ష్యాత్తూ కేంద్ర హోంశాఖ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన గణాంకాలే చెబుతున్నాయి.
కేంద్ర గణాంకాలే సాక్ష్యం..
లక్షలాది మంది భారతీయులు తమ పౌరసత్వం వదులుకొని విదేశాలకు వెళ్లిపోతుండటంపై తీవ్రమైన చర్చ నడుస్తున్నది. 2015 నుంచి గత ఏడేండ్లలో దాదాపు 9.46 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాలకు వెళ్లిపోయారు. హోంశాఖ గత రెండేండ్లలో పార్లమెంట్లో పలు సందర్భాల్లో ఇచ్చిన సమాధానాలను విశ్లేషిస్తే ఈ అంశం వెల్లడవుతున్నది. 2021లో అత్యధికంగా 1.63 లక్షల మంది భారత పౌరసత్వం వదులుకున్నారని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ నాయ్ తాజాగా మంగళవారం లోక్సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. గత మూడేండ్లలో మొత్తంగా 3.92 మంది పౌరసత్వం వదులుకుంటే వీరిలో అధికంగా 1.70 లక్షల మంది అమెరికా సిటిజన్షిప్ తీసుకున్నారని పేర్కొన్నారు. కెనడా(64,071), ఆస్ట్రేలియా(58,391), యూకే(35,435), ఇటలీ, న్యూజిల్యాండ్, జర్మనీ, తదితర దేశాలకు కూడా గణనీయ సంఖ్యలో భారతీయులు వెళ్లిపోయారని వెల్లడించారు.