న్యూఢిల్లీ: ఏజెంట్ చేసిన మోసంతో పలువురు భారతీయులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ముగ్గురు భారతీయులను రష్యా సైన్యం తమ తరపున పోరాడేందుకు బలవంతంగా వినియోగించుకొంటున్నది. అధిక వేతనాలు అంటూ ఎర చూపి వీరందరినీ ఒక ఏజెంట్ మభ్యపెట్టి, ఆర్మీ సెక్కూరిటీ సహాయకులుగా అక్కడకు పంపినట్టు బాధితుల్లో ఒకరు తెలిపినట్టు ది హిందూ పేర్కొన్నది. గత ఏడాది నవంబర్ నుంచి 18 మంది భారతీయులు రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోగా.. ప్రస్తుతం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఒకరు మరణించారని ఓ ఏజెంట్ తెలిపారు.
బాధితుల్లో ఒకరు హైదరాబాద్కు చెందిన వ్యక్తి కాగా.. సాయం చేయాలని అతని కుటుంబం గతనెల 25న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అశ్రయించింది. తర్వాత ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని, బాధితులను తిరిగి దేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒవైసీ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, మాస్కోలోని భారత ఎంబసీకి లేఖ రాశారు. బాధితులు యూపీ, గుజరాత్, పంజాబ్, జమ్ముకశ్మీర్లకు చెందిన వారిగా తెలుస్తున్నది. తమలో ముగ్గురికి రష్యా సైన్యం ఆయుధ వినియోగంపై శిక్షణ ఇచ్చిందని, జనవరిలో రొస్తోవ్ సరిహద్దుకు పంపిందని, గన్పాయింట్లో బలవంతంగా యుద్ధం చేయాల్సి వచ్చిందని ఓ బాధితుడు పేర్కొన్నాడని ది హిందూ నివేదించింది.