న్యూఢిల్లీ : కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఎదిగిన జ్యోతిరాదిత్య సింధియాపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. సింధియా అమ్ముడుపోయారంటూ యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్ ట్విటర్లో పోస్ట్ చేసిన కార్టూన్ కలకలం రేపింది. ఈ పోస్ట్పై బీజేపీ నేత ఆర్పీ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చవకబారు రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
దేశాన్ని అమ్మేసిన కాంగ్రెస్ నేతలు సింధియాపై విమర్శలు చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకత్వ రాజకీయ దివాళాకోరుతనానికి ఆ పార్టీ వ్యాఖ్యలు నిదర్శనమని చురకలు అంటించారు. యువనేతలు బీజేపీ పంచన చేరడంతో కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో నైరాశ్యంలో కూరుకుపోయిందని బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. కాంగ్రెస్లో రాహుల్ గాంధీ కంటే శక్తిమంతులైన నేతలను ఎదగనీయరని, బీజేపీలో యువకులను, నైపుణ్యం కలిగిన నేతలను ప్రోత్సహిస్తారని ఆయన పేర్కొన్నారు.