Indian Railways : భారత రైల్వే మంత్రిత్వ శాఖ (Indian Ralway Ministry) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. టికెట్ బుకింగ్ విధానంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి సరికొత్త ‘ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (Passenger Reservation System)’ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. దాదాపు 1986 నుంచి వాడుకలో ఉన్న పాత సాంకేతిక విధానాన్ని ఈ సరికొత్త వ్యవస్థతో పూర్తిగా మార్చేయనుంది. ఈ సరికొత్త అప్గ్రేడ్ వల్ల ఆన్లైన్ టికెట్ బుకింగ్ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది.
ఈ కొత్త బుకింగ్ విధానంలో నిమిషాల వ్యవధిలోనే లక్షలాది టికెట్లను ఎలాంటి సర్వర్ సమస్యలు లేకుండా బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త సిస్టమ్కు మారే ప్రక్రియపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలోని రైల్ భవన్లో ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సాంకేతిక మార్పుల సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగరాదని అధికారులను ఆదేశించారు. రైల్వే శాఖ 2002 సంవత్సరంలో ఇంటర్నెట్ ఆధారిత టికెట్ బుకింగ్ను ప్రారంభించింది. అప్పటి నుంచి కౌంటర్ల కంటే ఆన్లైన్లో బుక్ చేసుకునేవారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది.
ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న మొత్తం రైల్వే టికెట్లలో దాదాపు 88 శాతం బుకింగ్స్ కేవలం డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారానే జరుగుతున్నాయి. ఈ భారీ డిమాండ్కు అనుగుణంగానే పాత వ్యవస్థను అధునాతన సాంకేతికతతో రైల్వే మారుస్తోంది. రైల్వే శాఖ డిజిటల్ విప్లవంలో భాగంగా గత ఏడాది జూలైలో ప్రారంభించిన ‘రైల్ వన్’ యాప్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం ఏడాదిలోపే ఈ యాప్ 3.5 కోట్ల డౌన్లోడ్లను దాటేసింది. ఈ ఒక్క యాప్ ద్వారానే టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, రైలు లైవ్ స్టేటస్, ప్లాట్ఫామ్ సమాచారం, ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.
ప్రస్తుతం ఈ యాప్ ద్వారా రోజూ సుమారు 9.29 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. కొత్త సిస్టమ్తోపాటు ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వెయిటింగ్ లిస్ట్ టూల్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతోంది. మనం బుక్ చేసుకున్న వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా..? అనే అవకాశాలను ఈ టూల్ ముందుగానే అంచనా వేస్తుంది. దీని అంచనా కచ్చితత్వం గతంలో 53 శాతంగా ఉండగా.. ఇప్పుడు ఏకంగా 94 శాతానికి పెరిగింది. దీనివల్ల ప్రయాణికులు తమ ప్రయాణ ప్లాన్లను మరింత సులభంగా మార్చుకోవచ్చు.