Indian Railways : రైలు ప్రయాణికులకు శుభవార్త. త్వరలో భారతీయ రైళ్ల వేగం పెరగనుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాక నిర్ణయం తీసుకుంది. దేశంలోని మెయిల్స్, ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం పెంచాలని నిర్ణయించింది. ఎక్కువ దూరం ప్రయాణించే పలు రైళ్లే వేగం పెంచేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మెయిల్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్లు. ఇకపై ఈ వేగాన్ని 130 కిలోమీటర్లకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన రూట్లలో, దూర ప్రయాణాలకు మాత్రమే ఇది వర్తించే అవకాశం ఉంది. ఈ రైళ్ల వేగం పెరిగితే ఇప్పటికే వేగంగా ప్రయాణిస్తున్న రాజధాని, శతాబ్ది, వందేభారత్ రైళ్లతోపాటు ఈ సేవలు కూడా ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటాయి. అధికారిక అంచనా ప్రకారం కేంద్ర రైల్వే శాఖ నిర్ణయం వల్ల దేశంలోని 350–400 వరకు రైళ్ల వేగాన్ని పెంచుతారు. అయితే, ప్రాథమిక దశలో ఆధునిక ఎల్హెచ్బీ కోచ్లు ఏర్పాటు చేసిన రైళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది జర్మన్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వాడి తయారు చేసిన కోచ్లు మాత్రమే ఎక్కువ వేగాన్ని తట్టుకుని సురక్షితంగా ఉండగలవు. ఇవి గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా రూపొందాయి.
ఇతర రైళ్లకు కూడా ఈ నిర్మాణాలు అందుబాటులోకి వస్తే వాటి వేగాన్ని కూడా క్రమంగా పెంచుతారు. ఈ నిర్ణయం వల్ల దూర ప్రయాణాలు చేసే లక్షలాది మంది ప్రయాణికులకు మేలు జరుగుతుందని రైల్వే శాఖ తెలిపింది. మరోవైపు రైళ్లపై ఉండే ప్రధాన ఫిర్యాదు.. రైళ్లు ఆలస్యంగా రావడం. అందువల్ల ఈ సమస్యపై కూడా రైల్వే శాఖ దృష్టిపెట్టింది. దేశవ్యాప్తంగా రైళ్లకు సంబంధించి టైం టేబుల్ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది.
అలాగే, రైళ్ల వేగం పెంచడం వల్ల ప్రయాణించే సమయం తగ్గుతుందా, లేదా అనే అంశంపై కూడా రైల్వేశాఖ దృష్టి సారించనుంది. సాధారణ రైళ్లను కూడా ప్రీమియం రైళ్ల వేగాన్ని అందుకునేలా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ నిర్ణయం అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 40–45 కోట్ల మందికి లబ్ధి కలుగుతుంది.