Indian Railways | న్యూఢిల్లీ, అక్టోబర్ 8: నవరాత్రి పండుగ సీజన్లో ప్రయాణికుల ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ రైల్వే ‘నవరాత్రి వ్రత స్పెషల్ థాలి’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 150కిపైగా రైల్వే స్టేషన్లలో రుచికరమైన ‘నవరాత్రి స్పెషల్ థాలి’ భోజనాన్ని ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చునని రైల్వే శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
సికింద్రాబాద్, ముంబై సహా వివిధ స్టేషన్లలో ప్రత్యేక భోజనాన్ని ప్రయాణికులు పొందొచ్చునని, తయారీలో నాణ్యత, పోషకాహారం ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని రైల్వే శాఖ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఐఆర్సీటీసీ యాప్, ఈ-క్యాటరింగ్ వెబ్సైట్ నుంచి ప్రయాణికులు తమ పీఎన్ఆర్ నంబర్తో ప్రత్యేక భోజనాన్ని ఆర్డర్ చేయవచ్చునని చెప్పారు.