న్యూఢిల్లీ: రెండు రోజుల్లో 600కు పైగా రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. గురువారం షెడ్యూల్ చేసిన 307 రైళ్లను పూర్తిగా, 42 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. అలాగే శుక్రవారం బయలు దేరాల్సిన 320కి పైగా రైళ్లను రద్దు చేసింది. ఆపరేషనల్, నిర్వాహణ కారణాలతో 287 రైళ్లను పూర్తిగా, 41 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ఈ మేరకు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో పేర్కొంది. కాగా, రద్దైన ఈ రైళ్లలో రిజర్వ్ టిక్కెట్లు కలిగిన ప్రయాణీకులకు ఎలాంటి రద్దు ఛార్జీలు వసూలు చేయరు. అలాగే రైలు బయలు దేరాల్సిన మూడు గంటల లోపు రీఫండ్ కోసం టిక్కెట్లను సరెండర్ చేసినట్లయితే పూర్తిగా డబ్బులు తిరిగి ఇస్తారు.
మరోవైపు గత నెలలో కూడా సుమారు 670 ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు బొగ్గు కొరత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రైళ్ల ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా రాష్ట్రాల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.