Railway | దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో వాటి నివారణకు రైల్వేశాఖ ప్రణాళికను వెల్లడించింది. అన్ని రైళ్లు, యార్డుల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో కూడిన సీసీటీవీ కెమెరాలను బిగించనున్నట్లు బోర్డు చైర్పర్సన్, సీఈవో జయ వర్మ సిన్హా ప్రకటించారు. ఏఐ సాంకేతికతో కూడిన సీసీ కెమెరాలు అసాధారణ పరిస్థితులను గుర్తిస్తాయని.. భద్రతా చర్యలను మెరుగుపరుచడంలో కీలకపాత్రను పోషించనున్నాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్రాక్ల భద్రతపై సైతం స్పందించారు. వచ్చే ఏడాది కుంభమేళ జరుగనున్న నేపథ్యంలో ఎలాంటి దుశ్చర్యలు పాల్పడకుండా భద్రతా సంస్థలు రైల్వే ట్రాక్లపై నిరంతర నిఘా ఉంచుతాయనన్నారు.
ఈ సందర్భంగా కుంభమేళా సన్నాహకాలపై సమీక్షించారు. కుంభమేళాకు ముందే అవసరమైన మౌలిక సదుపాయాలు, విస్తరణ ప్రాజెక్టులను పూర్తవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 కుంభమేళా సందర్భంగా సుమారు 530 ప్రత్యేక రైళ్లను నడిపించారని.. వచ్చే ఏడాది జరిగే కుంభమేళా కోసం 900 వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తామన్నారు. ఈ సారి కుంభమేళాకు 30కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నామని.. రద్దీ నివారణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రయాగ్రాజ్ జంక్షన్ను అమృత్ భారత్ స్టేషన్గా ఎంపిక చేశామన్నారు. అయితే, దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఆధునికీకరణ, భద్రతా చర్యలకు భారీగా నిధులు వెచ్చిస్తున్నా పట్టాలు తప్పడం, రైళ్లు ఢీకొనడం, లెవల్ క్రాసింగ్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.