సిమ్లా: అమెరికాలో ఉంటున్న భారత సంతతి టెక్కీ, మెక్సికన్ డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన అంజలి రయోత్, భర్త ఉత్కర్ష్ శ్రీవాస్తవతో కలిసి కాలిఫోర్నియాలోని శాన్ జోస్లో నివసిస్తున్నది. గతంలో యాహులో ఉద్యోగం చేసిన ఆమె ఈ ఏడాది జూలై నుండి లింక్డ్ఇన్లో సీనియర్ సైట్ ఇంజనీర్గా పని చేస్తున్నది. ఈ నెల 22న ఆమె 30వ ఏటా అడుగుపెట్టనున్నది. దీంతో ట్రావెల్ బ్లాగర్ అయిన అంజలి తన పుట్టిన రోజును జరుపుకునేందుకు భర్తతో కలిసి ఈ నెల 20న మెక్సికోలోని తులుమ్కు వెళ్లింది.
బుధవారం రాత్రి 10:30 గంటలకు అంజలి, మరో నలుగురు పర్యాటకులు లా మల్క్వెరిడా రెస్టారెంట్ టెర్రస్పై భోజనం చేస్తున్నారు. ఇంతలో డ్రగ్స్ ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులు అక్కడకు వచ్చారు. పక్క టేబుల్ వద్ద ఉన్న ప్రత్యర్థుల డ్రగ్స్ ముఠా సభ్యులపై కాల్పులు జరిపారు. దీంతో ఇరువైపు జరిగిన కాల్పుల్లో అంజలితోపాటు జర్మనీ టూరిస్ట్ జెన్నిఫర్ హెంజోల్డ్ మరణించారు. జర్మనీ, నెదర్లాండ్స్కు చెందిన మరో ముగ్గురు పర్యాటకులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
అంజలి భర్త ఉత్కర్ష్ శ్రీవాస్తవ ఆమె మరణం వార్తను హిమాచల్ ప్రదేశ్ సోలన్లోని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తన సోదరి మృతదేహాన్ని త్వరగా భారత్కు రప్పించాలని అంజలి సోదరుడు ఆశిష్ సంబంధిత అధికారులను కోరారు. కాగా, కరోనా నేపథ్యంలో గత ఏడాది సోలన్కు వచ్చిన అంజలి నాలుగు నెలలపాటు తమ కుటుంబంతో గడిపి తిరిగి అమెరికా వెళ్లిందని తండ్రి కేడీ రయోత్, తల్లి నిర్మల గుర్తు చేసుకున్నారు.