హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా వెలుగుమట్ల కూల్చివేతల తర్వాత అక్కడి ప్రజలను చీల్చడానికి, ఆందోళనలను అణచివేయడానికి పెద్ద కుట్ర జరుగుతున్నదని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయేందర్ రావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ జతిన్కుమార్ విమర్శించారు. వెలుగుమట్ల కూల్చివేతల అనంతరం నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అక్కడి వాస్తవ పరిస్థితులను పరిశీలించినట్టు చెప్పారు. అక్కడ గుర్తించిన విషయాలను మంగళవారం ఒక ప్రకటన ద్వారా వివరించారు. ఇండ్లు కూల్చివేయడంతో తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, పరామర్శించడానికి వచ్చిన వారిని అరెస్టు చేశారని చెప్పారు.
మద్దతుగా వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించారని, అడ్డుకునేందుకు యత్నించిన నిరాశ్రయులు, పిల్లలపై లాఠీచార్జీ చేశారని తెలిపారు. నిరాశ్రయులకు నీళ్లు, ఆహారం వంటి కనీస అవసరాలను అందించడం లేదని, వీటిని అందించేందుకు వచ్చే వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారని వెల్లడించారు. నిరాశ్రయులను చెల్లాచెదురు చేయడానికి కొత్త కొత్త కుట్రలు పన్నుతున్నారని, స్వగ్రామానికి వచ్చి సమాచారమిస్తేనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలను తప్పుదారి పట్టించడానికి రెవెన్యూ మంత్రి పొంగులేటి, జిల్లా కలెక్టర్ కలిసి కుట్రలకు తెరలేపుతున్నట్టు గుర్తించామని చెప్పారు. సోమవారం ఆధార్ కార్డుల పరిశీలన పేరుతో కొందరిని కలెక్టరు ఆఫీసుకు పిలిచి వారితో ఇళ్ల స్థలాల కమిటీ వారికి లక్షల్లో డబ్బులు ఇచ్చినట్లుగా చెప్పమని, అలా చెపితే జాగాలు కేటాయించి ఇళ్లు కట్టిస్తామని ఆశచూపి, ఒత్తిడి చేసి, బెదిరించి తమకు కావలసిన సాక్షాలు సృష్టించుకున్నట్టు గుర్తించామని వివరించారు. మంత్రి పొంగులేటి పోలీసులతో బాధితులను లొంగదీసుకొని తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. మంత్రులు, కలెక్టర్ వ్యవహరిస్తున్న అనుచిత చర్యలను ఓపీడీఆర్ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు.