ఢిల్లీ: భారత సంతతి శాస్త్రవేత్త జోయితా గుప్తా ప్రతిష్ఠాత్మక స్పినోజా పురస్కారానికి ఎంపికయ్యారు. డచ్కు సంబంధించి శాస్త్ర విభాగంలో అత్యున్నతమైన ఈ అవార్డును డచ్ నోబెల్ పురస్కారంగా పిలుస్తారు. ‘సుస్థిర ప్రపంచం’ అంశంపై గుప్తా చేసిన స్ఫూర్తిదాయక పరిశోధనలకు గాను ఈ అవార్డు అందిస్తున్నట్టు ఆమ్స్టర్డమ్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ అవార్డుతో పాటు 15 లక్షల యూరోలను గుప్తాకు పరిశోధన కోసం ప్రోత్సాహకంగా అందిస్తారు. జోయితా ప్రస్తుతం ఆమ్స్టర్డమ్ వర్సిటీలో ‘దక్షిణార్ధ గోళంలో పర్యావరణం, అభివృద్ధి’ అంశంపై ఆచార్యురాలిగా, ఎర్త్ కమిషన్కు సహ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు.